హోటళ్లలో టీ వంటకాలే: నాయిని, బాబుపై హరీష్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి వారం రోజుల పాటు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ వంటకాలు ఉండాలని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించుకోవచ్చునని నాయిని తెలిపారు.
శనివారం సాయంత్రం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే వారికి ఆహార పదార్థాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హోటళ్ల నిర్వాహకులకు ఆయన సూచించారు.
నగరంలో అర్థరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉం చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. మహానగరంగా మారిన హైదరాబాద్ వాసుల అలవాట్లు మారిపోయాయి.
అర్థరాత్రి వరకు హోటళ్లలో గడిపేందుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం రాత్రి పది గంటల వరకే హోటళ్లు తెరిచి ఉంచే వారమని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ నాగరాజు తెలిపారు. ఈ సమయాన్ని అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించడం మాకు చాలా సంతోషకరమన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై హరీష్ రావు
తెలంగాణ కోసం పోరాడింది టీడీపీనే అని ఇక్కడ, రాష్ట్ర విభజన ఎమర్జెన్సీ కన్న ఘోరమని ఏపీలో చెబుతూ చంద్రబాబు పూటకో మాట చెబుతున్నారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. దీనిపై తెలంగాణ టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఇక్కడ సంబరాలు చేసుకుంటుంటే, అక్కడ విభజనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయాలని కలెక్టర్లు, అధికారులకు పిలుపునివ్వడం అవివేకమన్నారు. దీనిపై టీడీపీ నేతలు ఏం చెబుతారన్నారు. అవతరణ వేడుకలు జపురుకోవాలంటే టీడీపీ నేతలు ఆ పార్టీని వీడాలన్నారు.