ఆంధ్రా దొరల్ని తరిమేశాం: నాయిని సంచలనం, ఏపీ అభివృద్ధిపై కెటిఆర్
హైదరాబాద్: నాడు తెల్ల దొరలను మన పోరాటయోధులు తరిమేస్తే తాము ఆంధ్రా దొరలను తెలంగాణ నుంచి తరిమేశామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం నాడు అన్నారు. పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు తెల్ల దొరలను తరిమి స్వాతంత్ర్యం తెచ్చారని, నేడు మేం ఆంధ్రా దొరలను తరిమేసి తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చామన్నారు.
In Pics: హెచ్సియులో ప్రకాశ్ అంబేడ్కర్
జెండా ఆవిష్కరించిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. ఎందరో మహానీయుల త్యాగఫలమే ఈ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, సంక్షేమ పథకాల అమలులో దేశంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, రాష్ట్రంలో విద్యుత్ సమస్య నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
స్టార్టప్ హబ్గా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోందని, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.51 వేలు ప్రభుత్వం ఇస్తోందన్నారు.
బోనాలు, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తోందని, మేడారం జాతర కోసం భారీగా నిధులు కేటాయించారని, తెలంగాణ కళలను ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటు పడుతోందని, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర ముందంజలో ఉందని గవర్నర్ పేర్కొన్నారు.
దాడులు చేస్తామన్నారు: కెటిఆర్
మాదాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు చెప్పారు. గోకుల్ ఫ్లాట్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మంచి నీటి సమస్య, విద్యుత్ సమస్య ఉందని స్థానిక అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ చెప్పారన్నారు.
మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్కు చేసిందేమీ లేదని, గ్రేటర్లో టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకు వస్తే, సీఎం కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా హైదరాబాద్ను అభివృద్ధిని చేస్తారన్నారు.
అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను నియంత్రిస్తే టీఆర్ఎస్పై అనవసర ఆరోపణలు చేశారని, రాష్ట్రం విడిపోయినప్పుడు తమపై అనేక దుష్ప్రచారాలు చేశారని, దాడులు చేస్తారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, పంతొమ్మిది నెలల కాలంలో ఏ ఒక్కరిపైనా అయినా దాడి జరిగిందా? ప్రశ్నించారు.
ఇప్పుడు ఆంధ్రా అద్భుతంగా అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రం విడిపోకపోతే ఆంధ్రాలో అభివృద్ధి జరిగేదా అని అడిగారు. ఏ ప్రాంతం వారైనా హైదరాబాద్లో ఉండొచ్చునని, హైదరాబాద్ నగర అభివృద్ధికి టీఆర్ఎస్ ఎంతో కృషి చేస్తుందన్నారు.