కొన్ని విషయాల్లో: బాబుకు నాయిని, సెలవుదినాలు: కెసిఆర్ జాగ్రత్తలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో తెలంగాణను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని, తెలంగాణ భాషను, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం మండిపడ్డారు.
నాయిని గురువారం నాడు గోదావరి నది పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ధర్మపురిలో గోదావరి నదీ తీరంలో పారిశుద్ధ్యం అద్భుతంగా ఉందని చెప్పారు. అలాగే, పోలీసులు అధికారులు సమష్టిగా కృషి చేస్తున్నారన్నారు.
నాటకాలు ఆపు: భట్టిపై పిడమర్తి
పుష్కర ఏర్పాట్లను పరిశీలించకుండానే, పనుల్లో అక్రమాలు జరిగాయని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం భద్రాచలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియా గాంధీ మెప్పుకోసం భట్టి ఆడుతున్న నాటకాలు ఆపాలన్నారు.
పుష్కరాలపై కెసిఆర్ సమీక్ష
గోదావరి పుష్కరాల ముగింపు రోజులు కావడం, వారాంతపు సెలవు దినాలు కావడం వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు పకడ్పందీగా చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.
పుష్కరాల తీరుతెన్నులపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, వివిధ విభాగాల అధికారులతో సమీక్షించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. జిల్లాల్లోని తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.