నిజమైన తండ్రి నమ్మకం: సిటీ టెక్కీ నీలిమ క్షేమం
ఖాట్మాండ్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నీలిమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఆమె స్నేహితురాలు సోమవారం నీలిమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో నీలిమ తండ్రి తన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం నిజమైనట్లైంది.
హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం సంతోష్నగర్వాసి నీలిమ ఎవరెస్టు అధిరోహణలో ఎంపికై నేపాల్ వెళ్లింది. ఏప్రిల్ 18న శంషాబాద్ విమానాశ్రయంలో బయల్దేరే ముందు 21మంది బృందంతో తాను ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్తున్నానని కుటుంబసభ్యులకు చెప్పింది.
కాగా, ఏప్రిల్ 19న ఢిల్లీ నుంచి ఖాట్మాండ్ వెళ్లిన నీలిమ చివరిసారిగా ఏప్రిల్ 22న తల్లితో మాట్లాడింది. భూకంపం అనంతరం నీలిమ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని తల్లిదండ్రులు శౌరయ్య, కొండవీటి పాప ఆదివారం తెలిపారు.
నేపాల్లో సంభవించిన భూకంపం కారణంగా పర్వతాసానువులు విరుచుకుపడటంతో 20 మంది పర్వతారోహకులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీలిమ ఆచూకీ లభ్యం కాకపోయేసరికి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, నీలిమ క్షేమంగా ఉన్నట్లు ఆమె స్నేహితురాలు, అహ్మదాబాద్కు రింకు దేశాయి శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం పంపింది. వీరి బృందం ప్రస్తుతం టింగో అనే గ్రామంలో ఉన్నట్లు నీలిమ భర్తకు తెలిపింది. ఈ సమాచారాన్ని ట్రావెల్స్ సంస్థ నీలిమ తండ్రికి చేరవేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.