హైదరాబాద్ విధ్వంసానికి కుట్ర: ఐసిస్ టెర్రరిస్టుల ప్లాన్ ఇదే
హైదరాబాద్: నగరంలో పట్టుబడిన ఐసిస్ అనుమానితుల టెర్రర్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అతని సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ యాఖస్ ఇర్ఫాన్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్మౌదీ అలియాస్ ఫహద్లకు కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది.
అనంతరం ఉగ్రవాదులను చంచల్ గూడ జైలుకు తరలించారు. చారణ నిమిత్తం వీరిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో ఎన్ఐఏ వేసిన పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణకు రానుంది. కాగా, బుధవారం ఎన్ఐఏ అధికారులు 11 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే విచారణ అనంతరం వారిలో ఆరుగురిని ప్రశ్నించి వదిలివేశారు. ఈ విచారణలో ఎన్ఐఏ అధికారులు కంగుతినే విషయాలను ఐసిస్ సానుభూతిపరులు వెల్లడిస్తున్నారు. శనివారం (జులై 2)న హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో కనీసం మూడు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
టెక్కీ సాయంతో హైద్రాబాద్లో పేలుళ్లకు ఐసిస్ ప్లాన్: ఏం జరిగింది? (పిక్చర్స్)
రెండు రోజులు ముందే బాంబులను తయారు చేసుకోవాలనేది వారి ప్లాన్గా తెలిసింది. బాంబుల తయారీకి కావాల్సిన ముడి సామాగ్రిని ఇబ్రహీం హైదరాబాద్లోనే కోనుగోలు చేశాడు. అనంతరం బాంబుల తయారీకి ఇబ్రహీం పూనుకున్నాడు. బాంబు పరిణామం ఎంత ఉండాలో, ఎలా తయారు చేయాలో ఇబ్రహీంకు ఆన్లైన్లో సిరియా నుంచి షపీ చెప్పినట్లు విచారణలో వెల్లడించారు.
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో బాంబు దాడులు చేయాలని కుట్ర పన్నారు. నగరంలో మూడు చోట్ల దాడులకు పాల్పడేందుకు మొత్తం ఐదుగురిని వాడుకోవాలని ఐసిస్ సానుభూతిపరులు నిర్ణయించారు. జంటనగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు.
దీంతో పాటు పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు సికింద్రాబాద్లోని ప్రముఖ ఆలయాలను ఉగ్రవాదులు టార్గెట్గా పెట్టుకున్నారు. అమీర్ పేటలోని బిగ్బజార్, మాదాపూర్లోని ఐటీ కంపెనీలు, సైబర్ సిటీలోని షాపింగ్ మాల్స్ను ఉగ్రవాదులు టార్గెట్గా ఎంచుకున్నారు. కాగా, ఉగ్రదాడులకు పాల్పడే సమయంలో తమపై ఎవరైనా దాడి చేస్తే కాల్పులు చేసేందుకు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
హైద్రాబాద్పై ఐసిస్, ఇవే టార్గెట్: నెట్ ద్వారా బాంబు తయారీ నేర్చారు
ఇందుకోసం నాందేడ్ నుంచి పిస్టల్స్, తూటాలను నిందితుల్లో హబీబ్ కోనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం నగర శివారు ప్రాంతాల్లో ఎయిర్ ఫిస్టల్స్తో ఉగ్రవాద అనుమానితులు ఫైరింగ్ నేర్చుకున్నారు. ఇందు కోసం బార్కస్లోని హబీబ్ మహ్మద్ నివాసం వెనుక ప్రాంతంలో కొన్ని ప్రయోగాలు పూర్తి చేశారు.
అదే ప్రాంతంలో ఎయిర్ గన్ వినియోగించి టార్గెట్ బోర్డులపై ఫైరింగ్ ప్రాక్టీస్ సైతం జరిపారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో మార్చి 22న జరిగిన తరహాలో దాడులు చేయాలని ఐసిస్ ఉగ్ర పథక రచన చేసినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. అక్కడ ఐసిస్.. పేలుడు పదార్థంగా టీఏటీపీని (ట్రైఎసిటోన్ ట్రై పెరాక్సైడ్) వినియోగించింది.
ఎసిటోన్ రసాయనం, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాల మిశ్రమంతో దీన్ని తయారు చేసి బ్రస్సెల్స్ ఎయిర్పోర్ట్లో, మెట్రో స్టేషన్లో బాంబులను పేల్చారు. ఇవి బ్యాగేజీ స్కానర్లోనూ దొరకవు. బుధవారం చిక్కిన ఏయూటీ మాడ్యూల్ వద్ద కూడా ఎన్ఐఏ అధికారులు... రసాయనాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
అనుమానితుల్లో ఐదుగురిని (ఇబ్రహీం, ఇలియాస్, హబీబ్, అబ్దుల్లా బిన్, హుస్సేన్) అరెస్టు చేశారు. మిగిలిన ఆరుగురిని ఎన్ఐఏ అధికారులతో పాటు హైదరాబాద్ పోలీసులు ప్రశ్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
నిందితులపై హైదరాబాద్ ఎన్ఐఏ యూనిట్ ఆర్సీ-01/2016 నంబర్తో ఐపీసీ, ఎక్స్ప్లోజిక్స్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్లలోని వివిధ సెక్షన్లతోపాటు దేశద్రోహం ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉగ్రవాదుల వ్యూహాలను పారనివ్వకూడదని భద్రతాధికారులు పటిష్ఠ భద్రతను కల్పిస్తున్నారు.