'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే....
స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిను పోలీసులు ముందే అదుపులోకి తీసుకుంటే తన కొడుకు నరేష్, స్వాతిలు బతికేవారని మృతుడు నరేష్ తండ్రి వెంకటయ్య కన్నీరుమున్నీరు అయ్యారు.
భువనగిరి: స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిను పోలీసులు ముందే అదుపులోకి తీసుకుంటే తన కొడుకు నరేష్, స్వాతిలు బతికేవారని మృతుడు నరేష్ తండ్రి వెంకటయ్య కన్నీరుమున్నీరు అయ్యారు.
తనకు కనీసం తన కొడకు చివరి చూపు కూడా దక్కలేదన్నారు. నరేష్ను, స్వాతిని హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని వెంకటయ్య డిమాండ్ చేశారు.
ఊహించిందే జరిగింది: నరేశ్ను హత్య చేసింది స్వాతి తండ్రే! విషాదాంతమైన ప్రేమ కథ
యాదాద్రి భువనగిరి జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న స్వాతి, నరేష్ ప్రేమ కథ విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని నిందితుడిగా పోలీసులు తేల్చారు.
అతిజాగ్రత్తే శ్రీనివాస్ రెడ్డిని పట్టించింది
నరేష్ను హత్య చేసి దానిని తమ మీదకు రాకుండా చూసుకునేందుకు శ్రీనివాస రెడ్డి తీసుకున్న అతిజాగ్రత్తలే అతనిని పట్టించాయి. ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోల ఆధారంగానే కేసును ఛేదించినట్లు వెల్లడవుతుంది.
నరేష్ కుటుంబంపై అనుమానాలు కలిగేలా..
నరేష్ అదృశ్యమైన రోజే శ్రీనివాస రెడ్డి అతనిని హతమార్చాడు. పక్కా పథకం ప్రకారం స్వాతి వీడియోను బయటపెట్టి కేసును పక్కదోవ పట్టించాడు. అప్పటి వరకు పరువు హత్య కోణంలో సాగిన కేసు, వీడియోలో స్వాతి వెల్లడించిన విషయాలతో ఒక్కసారిగా నరేష్ కుటుంబంపై అనుమానాలకు తెరలేపాయి.
శ్రీనివాస రెడ్డికి కొందరి సహకారం
నరేష్ కుటుంబ సభ్యులు సైతం మరో లేఖను బయటపెట్టారు. మొత్తానికి శ్రీనివాస రెడ్డి సోషల్ మీడియాను ఉపయోగించుకునేందుకు మరికొందరు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మలుపులు తిరిగింది
స్వాతి, నరేష్ల కేసు మొదటి నుంచి రోజుకో మలుపు తిరిగింది. ఈనెల 2న భుననగిరి బస్టాండ్లో ప్రారంభమైన ఈ వ్యవహారం శనివారం శ్రీనివాస రెడ్డి పొలంలో ముగిసింది. ఈ 25 రోజుల్లో పలు కొత్త కోణాలు బయటకు వచ్చాయి.
సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కేసు గురించి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తన 22 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసు చూడలేదన్నారు. ప్రధానంగా పరువు కోసం చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు శ్రీనివాసరెడ్డి ఎన్నో పన్నాగాలు పన్నాడు.
పరువు తీశాడని..
తన కూతురు స్వాతిని వివాహం చేసుకుని పరువు తీశాడన్న కక్షతో ఆమె తండ్రి శ్రీనివాసరెడ్డే నరేశ్ను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నరేశ్ ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం, జూన్ 1లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఏడు బృందాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నరేశ్ హత్యకు గురయ్యాడని తేల్చిన విషయం తెలిసిందే.
ప్రేమించుకొని పెళ్లి.. ముంబైలో కాపురం పెట్టారు
ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజి నరేశ్, అదే మండలం లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి చదువుకునే రోజుల్నుంచే ప్రేమించుకుంటున్నారు. మార్చి 23న ఇద్దరూ ముంబైలోని నరేష్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. రెండురోజుల అనంతరం వర్లిలో పెళ్లి చేసుకున్నారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆత్మకూరు పోలీసులు మార్చి 27న వారిద్దర్నీ అక్కడికి పిలిపించారు. విడిగా ఉండేందుకు ఇరువురు అంగీకరించడంతో స్వాతిని అక్కడే వదిలేసి నరేశ్ ముంబై వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఉప్పల్లోని అక్క ఇంట్లో ఉన్న స్వాతి అదే నెల 31న తిరిగి నరేశ్ వద్దకు వెళ్లింది. స్వాతిని ఇంట్లోకి రానిచ్చేందుకు నరేశ్ కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇరువురూ ముంబైలో వేరే కాపురంపెట్టారు.
నరేష్, స్వాతిల మధ్య విభేదాలు.. ఉపయోగించుకున్న శ్రీనివాస్ రెడ్డి
ఆర్థిక సమస్యల నేపథ్యంలో కొన్ని రోజులకే నరేష్, స్వాతిల మధ్య మనస్పర్థలు రావడంతో.. స్వాతి తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి రమ్మని చెప్పడంతో.. స్వాతి, నరేశ్తో కలిసి ఈ నెల 2న రాత్రి భువనగిరి బస్టాండుకు వచ్చింది. బోడుప్పల్కు చెందిన సోదరుడి కొడుకు నల్ల సత్తిరెడ్డి కారులో అక్కడికి వెళ్లిన శ్రీనివాసరెడ్డి కుమార్తెను వెంటబెట్టుకుని లింగరాజుపల్లికి వచ్చాడు. స్వాతి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో నరేశ్ తన తో కలిసి బైక్ పైన ఆ కారును అనుసరించాడు. నరేశ్ ఊరి బయటే ఉండి స్నేహితుణ్ని స్వాతి ఇంటి దగ్గరికి పంపించాడు.
వెంబడించి..
రాత్రి 11 గంటల సమయంలో ఇంటి బయట ఎవరో తచ్చాడుతుండటాన్ని గమనించిన శ్రీనివాసరెడ్డి అతణ్ని నిలదీసే ప్రయత్నం చేయగా పారిపోయాడు. వెంటనే శ్రీనివాసరెడ్డి ఇనుప రాడ్ తీసుకొని తన బైక్ పైన సత్తిరెడ్డితో కలిసి అతణ్ని వెంబడించాడు. ఊరి బయట స్నేహితుని కోసం ఎదురుచూస్తున్న నరేశ్ను గమనించిన ఇద్దరూ అతన్ని వెంటబెట్టుకుని తన పొలం వద్దకు తీసుకెళ్లారు. మాట్లాడుతున్నట్టు నటిస్తూ శ్రీనివాసరెడ్డి.. నరేశ్ తలపై రాడ్తో కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.
మూసిలో కలిపేశారు
అక్కడే ఉన్న కంది పొరకల్లో అతని మృతదేహాన్ని పడేసి నిప్పంటించారు. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ఇద్దరూ కలిసి ఆత్మకూరులో పెట్రోలు కొనుగోలు చేయడంతోపాటు.. తిరిగి ఇంటికెళ్లి ట్రాక్టర్ టైర్లను తీసుకొచ్చారు. టైర్ల మధ్యలో మృతదేహాన్ని ఉంచి పెట్రోలు పోసి కాల్చేశారు. మృతదేహం పూర్తిగా కాలి బూడిదైన తర్వాత సత్తిరెడ్డి తిరిగి తన కారులో బోడుప్పల్కు వెళ్లిపోయాడు. శ్రీనివాసరెడ్డి అస్తికలు, బూడిదను రెండు గోనెసంచుల్లో మూట కట్టుకుని ద్విచక్ర వాహనంలోనే వేములకొండ-లక్ష్మాపూర్ గ్రామాల మధ్య ఉన్న మూసీ నదిలో కలిపేశాడు.
సెల్ ఫోన్ను ధ్వంసం చేసి..
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నరేశ్ సెల్ ఫోన్ను సత్తిరెడ్డి తన వెంట బోడుప్పల్ తీసుకెళ్లాడు. తర్వాత మౌలాలి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి స్విచ్ ఆఫ్ చేసి అక్కడే ధ్వంసం చేశాడు. నరేశ్ భువనగిరి నుంచే ముంపబై వెళ్లి ఉంటాడని ముందు నుంచి శ్రీనివాసరెడ్డి చెబుతుండటం.. హత్య జరిగిన రోజు రాత్రి నరేశ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ లింగరాజుపల్లిలో ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో విచారించడంతో శ్రీనివాసరెడ్డి హత్య గురించి తెలిపాడు.
నిందితులు శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డిలను శనివారం నకిరేకల్ న్యాయసానంలో హాజరుపరిచారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
స్వాతి అంశంపై..
కాగా, తన తండ్రిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలతో స్వాతి ఈ నెల 7న, 12న రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిందని, 16న తెల్లవారుజామున ఇంట్లోని మరుగుదొడ్డిలో ఉరివేసుకుని మరణించిందని దాని వెనుకా శ్రీనివాసరెడ్డి పాత్ర ఉందా? అన్నది విచారణలో తేలుతుందని పోలీసులు వెల్లడించారు.