శిరీష-రాజీవ్ భార్యాభర్తలని..: షాకైన తేజస్విని, ఆత్మహత్యకు కారణాలివేనా?
బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో రెండు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు నిందితులు రాజీవ్, శ్రవణ్లను నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో రెండు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు నిందితులు రాజీవ్, శ్రవణ్లను నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు.
కాగా, విచారణలో వారు ఆసక్తికర విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. శిరీష, రాజీవ్ల మధ్య గొడవల్ని సొమ్ము చేసుకోవాలనే కుట్రతోనే ఆమెను కుకునూరుపల్లికి తీసుకెళ్లినట్లు శ్రవణ్ విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది.
'శిరీష మృతిపై అనుమానాలుంటే హైదరాబాద్ రండి', 'రెండో హ్యాండ్ బ్యాగ్ ఎవరిది'
శిరీష ఉపయోగపడుతుందని..
తన ఫ్రెండ్ శిరీష, ఆమె స్నేహితుడు రాజీవ్లకు గొడవలు ముదిరిపోయాయని, వాటిని మీరే పరిష్కరించాలని, ఇద్దరినీ అక్కడికి తీసుకొస్తానని, శిరీషను ఉపయోగించుకుంటే మనకు లాభమని, ఈ వ్యవహారం రాజీవ్కు తెలియకుండా చూసుకుందామని కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డికి చెప్పానని శ్రవణ్ చెప్పినట్లు సమాచారం.
తేజస్విని వద్దకు పోలీసులు
శిరీషతో తాను గొడవపడిన మాట వాస్తవమేనని రాజీవ్ స్నేహితురాలు తేజస్విని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు ఫోన్ చేయగా తాను రాయదుర్గంలో ఉన్నానని చెప్పడంతో ఇద్దరు పోలీసులు వెళ్లి ఆమెతో మాట్లాడారు. శిరీషతో తనకు గతంలో ఎలాంటి పరిచయం లేదని, ఆర్జే స్టూడియోలోనే తొలిసారిగా ఆమెను చూశానని తేజస్విని చెప్పారు.
రాజీవ్, శిరీషలు భార్యాభర్తలని.. తేజస్విని షాక్
తాను, రాజీవ్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఒకరోజు స్టూడియోకి వెళ్లానని, రాజీవ్, శిరీషలు భార్యభర్తలంటూ అక్కడి పనివారు చెప్పడంతో తనకు కోపం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకే పోలీస్ స్టేషన్ వెళ్లామని, నిజంగా ఆమెపై ద్వేషం ఉంటే ఫిర్యాదు వెనక్కు తీసుకునేదాన్ని కాదని చెప్పారు. మరోవైపు నందు, నవీన్లు ఎవరంటూ తేజస్విని, రాజీవ్, శ్రవణ్లను ప్రశ్నించగా.. తమకు తెలీదని, శిరీషకు స్నేహితులు లేదా బంధువులై ఉండొచ్చని చెప్పారు.
ఆత్మహత్యకు కారణాలు ఇవేనా?
ఇదిలా ఉండగా, శిరీష ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను పోలీసులు మరోసారి నిర్ధారించుకున్నారు. రాజీవ్తో అనుబంధంలో ఉన్న శిరీషకు కుక్కునూరుపల్లి వెళ్లిన తర్వాత వివిధ విషయాలు తెలిశాయని, వాటిని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తేజస్వినితో వివాదం అనంతరం రాజీవ్ తనకు మరింత దగ్గరవుతాడని శిరీష భావించిందని, అందుకే రాజీవ్, శ్రవణ్ తో కలిసి రాత్రి సమయంలో కుక్కునూరుపల్లికి వచ్చిందని తేల్చారు. అక్కడ ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడంతో ఆమెకు వివిధ విషాయాలపై క్లారిటీ వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ సహకరించాడన్న విషయం ఆమెకు అక్కడే అర్థమైంది.
రాజీవ్ కూడా వంచించాడని..
రాజీవ్ కూడా తనను వంచించాడని అప్పుడే శిరీష అర్థం చేసుకుందని పోలీసులు నిర్ధారించుకున్నారని తెలుస్తోంది. సహకారం పేరుతో ఎస్సై ఆలోచనను శిరీష పసిగట్టిందని, దీంతో ఆమె కారులో వారితో కలిసి వెళ్లేందుకు కూడా నిరాకరించిందని నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో శిరీషపై రాజీవ్, శ్రవణ్ దాడి చేసినట్టు గుర్తించారు. వారి వేధింపులతోనే కారులోంచి శిరీష దూకేసేందుకు ప్రయత్నించిందని వారే పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై మళ్లీ దాడి జరిగిందని, దీంతో రాజీవ్ వంచన, శ్రవణ్ నమ్మకద్రోహాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారిస్తున్నారు.