మావోల పాత్ర లేదు: సూర్యాపేట కాల్పులపై డిజిపి
నల్లగొండ: పోలీసులపైకి కాల్పులు జరిగిన సంఘటనలో మావోయిస్టుల పాత్ర లేదని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో కాల్పులు జరిగిన సంఘటనా స్థలాన్ని ఆయన గురువారం ఉదయం పరిశీలించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ ముఠాలే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు.
నల్గొండ జిల్లాలోని సూర్యాపేట హటెక్ బస్టాండ్లో గత అర్థరాత్రి 12:30 గంటలకు పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారని ఎస్పీ ప్రభాకర్రావు తెలిపారు. దుండగుల కోసం ఏపీ, తెలంగాణలో గాలింపు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
పోలీసులపై నిందితులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు పాల్గొని ఉండవచ్చన్నారు. సంఘటనా స్థలంలో ఒడిశాకు చెందిన ఐడీ కార్డు లభ్యమైనట్లు చెప్పారు. అలాగే పోలీసుల తుపాకీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
కాల్పులకు పాల్పడింది యూపీకి చెందిన మీరట్ గ్యాంగ్గా ఎస్పీ తెలిపారు. మీరట్ గ్యాంగ్లోని సభ్యుడు తన్వీర్పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కాల్పుల ఘటనా స్థలాన్ని ఐజీ నవీన్చంద్, డీఐజీ గంగాధర్, ఎస్పీ ప్రభాకర్రావు పరిశీలించారు.
కాల్పుల్లో మరణించిన హోంగార్డు కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని, ఇతర బెనిపిట్స్ కూడా అందేలా చూస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు.