హడావుడి విభజన, రెచ్చగొడ్తున్నారు: సీఎంలపై జేపీ, సెక్షన్ 8పై కోదండ
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సీమాంధ్రులకు రక్షణ లేదన్న టీడీపీ వాదనకు విపక్షాల నుండి మద్దతు లభించడం లేదు. సోమవారం నాడు లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. 13 నెలలుగా ఇతర ప్రాంతాల వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
నాయకులు ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చిన్న చిన్న విభేదాలు ముదిరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఎన్నికల కోసం నాడు హడావిడిగా విభజన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల మధ్య ఎంతగా చిచ్చుపెడితే అంత రాజకీయ లబ్ధి పొందవచ్చునని అనుకుంటున్నారని చెప్పారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం రోజుకో దుమారం రేపుతున్నారని మండిపడ్డారు.
పార్టీలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటివని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత విభేదాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు రెచ్చగొట్టే వారి వ్యాఖ్యలను గుర్తించాలని హితవు పలికారు.
సెక్షన్ 8 రెండు రాష్ట్రాల సమస్య కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పట్టుబడిన తర్వాతనే సెక్షన్ 8 తెరపైకి వచ్చిందన్నారు.
ట్రాన్స్కో ఆంధ్రా ఉద్యోగుల రిలీవ్పై హైకోర్టులో విచారణ
తెలంగాణ ట్రాన్స్కోలో ఆంధ్రా ఉద్యోగుల రిలీవ్ వివాదంపై హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు తెలంగాణ ట్రాన్స్కో వాదనలు వినిపించేదుకు సమయం కోరింది. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.