మోడీ, కేసీఆర్ టు జైట్లీ: ఊహల రాజధాని: 'అమరావతి'లో కదలిక లేదా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రెండున్నరేళ్లుగా రాజధాని అమరావతి నిర్మాణం పేరిట హడావుడి తప్ప ఏం చేయడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాక్షిలో ఓ కథనం కూడా వచ్చింది.
ఉత్తుత్తి భవనాలకు మరో శంకుస్థాపన అని ఓ కథనం ఇచ్చింది. డిజైన్ లేదని, టెండర్ లేదని పేర్కొంది. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరిపాలనా నగరం శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో హడావుడి తప్ప ఏం లేదని ఆరోపిస్తున్నారు.
తన కథనంలో సాక్షి అమరావతిని ఊహల రాజధానిగా పేర్కొంది. ఇప్పటికే అనేక శంకుస్థాపనలు, పలుమార్లు భూమి పూజలు చేసిన ప్రభుత్వం ప్రతి సారి ఏదో హడావుడి చేస్తోందని పేర్కొంది. శుక్రవారం జైట్లీ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ భవనాల సముదాయం రూపురేఖలపై ప్రభుత్వానికే స్పష్టత లేదని, డిజైన్ ఖరారు కాలేదని పేర్కొంది.
రెండున్నరేళ్లుగా అన్నీ శంకుస్థాపనలే అంటూ కొన్నింటిని ఏకరువు పెట్టింది. వెలగపూడిలో హడావుడిగా, అరకొర సదుపాయాలతో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం తప్ప ప్రధానమైన నిర్మాణాలు ఏవీ పునాదులు కాదు కదా డిజైన్కు కూడా నోచుకోలేదని పేర్కొంది.
2015 జూన్ 6వ తేదీన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో సీఎం చంద్రబాబు రాజధానికి భూమి పూజ చేశారు. అయితే, ఇక్కడ ఎటువంటి నిర్మాణం జరగలేదని, ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉందని పేర్కొంది.
2015 అక్టోంబర్ 22న విజయ దశమి రోజు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేశారని, మోడీ తెచ్చిన మట్టి, యమునా నది నీరు తళ్లూరు తహసీల్దారు కార్యాలయంలో భద్రంగా ఉందని, మిగిలిన వాళ్లు తెచ్చిన మట్టి వర్షాలకు కొట్టుకుపోయిందని పేర్కొంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వచ్చారు. అక్కడ నిర్మాణాలు నోచుకోలేదని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రివరి 17న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసారు. ఇది మాత్రమే అరకొర వసతులతో పూర్తయిందని పేర్కొంది.