ఏపీ పుస్తకాల్లో టి చరిత్రకు నో: వెళ్లిపో.. బాబుకు శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం
హైదరాబాద్: ఏపీ పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్రను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ శాసన సభా పక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మ్ట్లాడారు.
ప్రజల మధ్య విద్వేషాలు, రెచ్చగొట్టే చర్యలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విరమించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రను తొలగిస్తే ఈ గడ్డమీద ఏపీకి చెందిన వారి విగ్రహాలు, కాలనీలకు, పార్కులకు పేర్లు ఎందుకుండాల్నారు.
విశాలాంధ్ర కోసం కృషి చేసిన బూర్గుల రామకృష్ణ రావు, గిరిజన దేవతలైన సమ్మక్క, సారక్కలతో పాటు హైదరాబాదుకు సంబంధించిన అంశాలన్నీ తొలగించాలని పేర్కొనడం దారుణమన్నారు. రెండు రోజుల్లో ఏపీ సర్కారు తన చర్యలను ఉపసంహరించుకోకుంటే ప్రతిచర్యలకు దిగుతామన్నారు.
ఆంధ్రాకు చెందిన వారి పేర్లు, విగ్రహాలు తొలగించాలని సిఎం కెసిఆర్కు, జిహెచ్ఎంసీలకు లేఖలు రాస్తామన్నారు. ఇక్కడున్న వారి విగ్రహాలను తీసుకెళ్లాలని, అవసరమైతే లారీ అసోసియేషన్తో మాట్లాడి రెండున్నర లక్షల లారీలతో 2 రోజుల పాటు ఉచితంగా సర్వీస్ చేయిస్తామన్నారు.
ఏపీ తీరుపై స్పందించని పార్టీలను నిలదీస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్రను తొలగించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. చంద్రబాబూ.. తీరు మార్చుకోక పోతే తక్షణమే మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపో అని అల్టిమేటం జారీ చేశారు.
రెండ్రోజుల్లోగా సర్క్యులర్ను విరమించుకోవాలని, లేదంటే శంషాబాద్ విమానాశ్రయంతో పాటు అన్ని ఆంధ్రా నేతల పేర్లను తొలగించాలని, ట్యాంక్ బండ్పైనున్న ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను తొలగించాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తామన్నారు.