కేసీఆర్ భయపడ్డాడా? 'ఓయూ'లో ఎందుకు మాట్లాడలేదు: ప్రతిపక్షాల కౌంటర్
విద్యార్థులంటే భయంతోనే కేసీఆర్ ఓయూ సభలో ప్రసంగించలేకపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఉస్మానియా అంటే నిరంతర చైతన్య స్పూర్తి.. ప్రభుత్వాలకు లొంగని తెగువని ప్రదర్శించే విద్యార్థి లోకం ఇక్కడ ఉన్నది కాబట్టే.. వాళ్లు పిడికిలెత్తి జై కొడితే.. ఏ సర్కార్ అయినా తోక ముడవాల్సిందే. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా.. ఆ సెగ తెలంగాణ సీఎం కేసీఆర్కు గట్టిగానే తగిలింది.
ఉస్మానియా యూనివర్సిటీలోకి కేసీఆర్ ప్రవేశించిన వేళ.. దారి పొడుగున ఉన్న విద్యార్థులంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదం చేశారు. 'కేసీఆర్ డౌన్ డౌన్..' అంటూ వాళ్లు చేసిన నినాదాలు.. ఆఖరికి సీఎం మైక్ పట్టుకోవాలంటే భయపడేలా చేశాయి. చివరకు అంత చారిత్రక నేపథ్యం ఉన్న సభలో ఒక్క మాట మాట్లాడకుండానే కేసీఆర్ వెనుదిరిగారు.
నిజానికి సభలో కేసీఆర్ మాట్లాడి ఉంటే, విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఈ మేరకు ఇంటలిజెన్స్ వర్గాలు ముందుగానే కేసీఆర్ కు సమాచారమివ్వడంతో.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కేసీఆర్ విద్యార్థి లోకానికి భయపడ్డారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది.
అటు ప్రత్యర్థి వర్గాలు సైతం ఇదే విషయాన్ని లేవనెత్తుతూ కేసీఆర్ తీరును ఎండగడుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ.. విద్యార్థులంటే భయంతోనే కేసీఆర్ ఓయూ సభలో ప్రసంగించలేకపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మూడేళ్ల తర్వాత ఓయూ క్యాంపస్ లో అడుగుపెట్టిన కేసీఆర్.. మూగవాడిగానే వెనుదిరిగారని ఎద్దేవా చేశారు.
పోలీస్ రాజ్యంతో ఉద్యమాలను అణిచివేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, తెలంగాణ ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందని జీవన్ రెడ్డి తెలిపారు. ఏదేమైనా ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం.. ప్రతిపక్షాలకు ఆయన్ను టార్గెట్ చేయడానికి అందివచ్చిన అస్త్రంగా మారింది.
కాగా, రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. అదిగో ప్రకటన.. ఇదిగో ప్రకటన.. అంటూ ఊరిస్తూ వస్తున్నారే తప్ప.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో సర్కార్ తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ఓయూ శతాబ్ది ఉత్సవాలను విద్యార్థులు కూడా బాగానే ఉపయోగించుకున్నారు.