కేసీఆర్ వర్సెస్ జైపాల్: కోదండ షాకిచ్చారు, ఎవరి వల్ల తెలంగాణ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం తెరాస అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు కారు ఎక్కారు.
దీంతో, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు మొదలు తెలంగాణ తెచ్చి క్రెడిట్ ఎవరిదనే వరకు మరోసారి తెరపైకి వాదన వచ్చింది. విపక్షాలన్నింటితో పాటు కాంగ్రెస్, టిడిపిలు ఇప్పటికే ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాయి.
అయితే తెరాసను, కెసీఆర్ను ఇరుకున పెట్టేందుకు అప్పుడప్పుడు తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందనే అంశం తెరపైకి వస్తోంది. తాజాగా మరోసారి వచ్చింది. అయితే, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు కలిసి పని చేసిన జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కెసిఆర్ పోరాట ఫలితంగానే కాంగ్రెస్ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందని తెరాస చెబుతుంటుంది. కేసీఆర్ ఒక్కడి వల్ల రాలేదని, తామంతా ఉద్యమంలో పాల్గొన్నామని, అధినేత్రి సోనియా గాంధీని ఒప్పించామని, కేసీఆర్ వల్ల తెలంగాణ రాకపోయేది అనేది కాంగ్రెస్ వాదన.
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల వాదన. బీజేపీ తెలంగాణకు మొదటి నుంచి మద్దతు పలుకుతోందని, సభలో విభజన సమయంలో సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించారని, ఉద్యమంలో తమ పాత్ర ఎంతో ఉందనేది బీజేపీ వాదన.
ఏ పార్టీ వైఖరి ఎలా ఉన్నా.. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వల్లే తెలంగాణ వచ్చిందనే వాదన ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా తమ పాత్రతో పాటు సోనియా వద్ద జైపాల్ రెడ్డి చక్రం తిప్పారని అందుకే తెలంగాణ వచ్చిందని చెబుతుంటారు.
ఇప్పుడు ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఉండవల్లి అరుణ్ కుమార్తో పాటు స్వయంగా జైపాల్ రెడ్డి కూడా తన వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాదనకు బలం చేకూరేలా కోదండరాం కూడా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
2009 డిసెంబర్ 7న అన్ని పార్టీల ఆంధ్రా నేతలు కూడా అఖిల పక్షంలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటనలు చేశారని, కానీ ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్ నేతలు మాత్రం అలాంటి నైతిక విజ్ఞత ప్రదర్శించలేకపోయారని, పార్లమెంటు ప్రొసీడింగ్స్ భగ్నం చేసి బిల్లును ఆపే యత్నం చేశారని కోదండ ఆన్నారు.
సోనియా పట్టుదల, సుష్మా స్వరాజ్, కమలనాథ్ల మధ్య సయోధ్య, జైపాల్ రెడ్డి పాత్ర వల్ల బిల్లు పాసైందన్నారు. ఇప్పటి దాకా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చెప్పడం వేరు. అయితే కోదండరాం.. వ్యాఖ్యలు మాత్రం కేసీఆర్కు షాకేనని అంటున్నారు.