స్వాతిని బెదిరించలేదు, బాధలో ఉన్నాం: ఎన్నారై మధుకర్ తండ్రి
తాము ఎవరినీ బెదిరించలేదని మధుకర్ రెడ్డి తండ్రి బాల్ రెడ్డి అన్నారు. మధుకర్ చనిపోయిన తర్వాత స్వాతి, ఆమె బంధువులకు తాము ఫోన్ చేయలేదని ఆయన తెలిపారు.
హైదరాబాద్: తాము ఎవరినీ బెదిరించలేదని మధుకర్ రెడ్డి తండ్రి బాల్ రెడ్డి అన్నారు. మధుకర్ చనిపోయిన తర్వాత స్వాతి, ఆమె బంధువులకు తాము ఫోన్ చేయలేదని ఆయన తెలిపారు.
కొడుకు చనిపోయిన బాధలో ఉన్నాం..
తాము కొడుకు చనిపోయిన బాధలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము ఆధారాలు వెతుక్కునే పనిలో లేమని చెప్పారు. తమ మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవన్నారు. కుటుంబం పరువును బజారుకీడ్చడం సరికాదన్నారు.
బెదిరింపు ఆరోపణలు
కాగా, అంతకుముందు స్వాతి, ఆమె తల్లిదండ్రులు బెదిరింపు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు, రవీందర్ రెడ్డిలు తమ కూతురును చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని స్వాతి తండ్రి తెలిపారు.
స్వాతి తండ్రి ఆవేదన.. మధుకర్ తండ్రి స్పందన
మధుకర్ రెడ్డి తల్లిదండ్రుల మద్దతుతోనే రవీందర్ రెడ్డి తమను బతకనివ్వమంటూ బెదరిస్తున్నాడని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్వాతి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, దీనిపై మధుకర్ తండ్రి స్పందించారు.
డిప్రెషన్ వల్లే
మధుకర్ డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తాము అనుకుంటున్నామని స్వాతి తల్లిదండ్రులు ఇది వరకే చెప్పారు. ఆస్తులు తాము తీసుకుంటామని భావించే తన కూతురుపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
తన కూతురుకు పాప ఉందని, కాబట్టి ఆస్తి అడుగుతారని భావించే, అలా అడగకుండా ఉండేందుకు, బెదిరించే ఉద్దేశ్యంలో భాగంగనే తమపై దాడి చేసి ఉంటారని స్వాతి తల్లి అన్నారు. తాము ఇప్పటి వరకు వాళ్ల ఆస్తి గురించి ఆలోచించలేదన్నారు. తమకు దాని గురించి ఆలోచనే లేదన్నారు.