గ్రేట్ స్టేట్స్మన్: కెసిఆర్కు న్యూస్ ఏజెన్సీ అవార్డు
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రాష్ట్ర రాజనీతిజ్ఞుడు అవార్డును అందుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కెసిఆర్ చూపిన పోరాట పటిమకు గుర్తింపుగా గ్రేట్ స్టేట్స్మన్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఎంపికయ్యారు.
ముఖ్యమంత్రి కెసిఆర్కు ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ న్యూస్ సర్వీసెస్ సిండికేట్(ఎన్ఎస్ఎస్) శుక్రవారం ఈ అవార్డును ప్రదానం చేసింది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించే క్రమంలో కేసీఆర్ ఎత్తుగడలు, పోరాటపటిమ అనితరసాధ్యమని ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు ఈ సందర్భంగా కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం కెసిఆర్ చేపట్టిన నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని అన్నారు.
13ఏళ్లపాటు కెసిఆర్ చూపిన రాజకీయ చతురత, నాయకత్వ పటిమను సంస్థ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్లీనరీ సమావేశం అనంతరం కెసిఆర్కు ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు అవార్డును అందజేశారు.