ఎన్టీఆర్ కూడా తెలంగాణ ఉద్యమకారుడేనట: ఎలానో చెప్పిన రేవంత్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీ రామారావు కూడా తెలంగాణ ఉద్యమకారుడేనట. ఈ మాట చెప్పిందెవరో తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాసిన వ్యాసంలో అదెలాగో ఆయన చెప్పారు.
ఎన్టీఆర్ అమలు చేసిన 610 జీవో కారణంగానే మరోసారి తెలంగాణలో ఉద్యమానికి చలనం వచ్చిందని, ఈ కోణం నుంచి చూస్తే ఎన్టీఆర్ కూడా తెలంగాణ ఉద్యమకారుడేనని ఆయన అన్నారు. ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఎన్టీ రామారావు ప్రభుత్వం 610 జీవోను జారీ చేసింది.
అయితే, ఆ జీవోను ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోయింది. సీమాంధ్ర ఉద్యోగుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వాలు ఆ జీవోను అమలు చేయలేకపోగా, వివిధ కమిటీలను వేస్తూ వెళ్లాయి. చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి 610 జీవో అమలు ప్రధాన అస్త్రంగా మారింది. దాని అమలు కోసమే అన్నట్లు అప్పట్లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
ఎన్టీఆర్ ప్రభుత్వం రూ.50కే హార్స్ పవర్ విద్యుత్తు పథకాన్ని అమలు చేసిందని, దానివల్ల ఎక్కువగా లాభపడింది తెలంగాణ రైతాంగమేనని రేవంత్ రెడ్డి తన వ్యాసంలో అన్నారు. పటేల్, పట్వారీల వ్యవస్థను రద్దు చేయడం వల్ల తెలంగాణ గ్రామాల్లో ప్రజాకంటకుల పీడ విరగడై ప్రజలకు ఎంతో ఊరట లభించిందని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగరానికి నిత్యం లక్షలాది మంది వస్తున్నా గౌలిగూడలో కేవలం ఒక పాత రేకుల షెడ్డు మినహా మరో బస్టాండేదీ లేకుండా పోయిందని, ఈ స్థితిల రాజధానికి తగ్గ స్థాయిలో అత్యంత విశాలమైన ఇమ్లిబన్ (మహాత్మాగాంధి) బస్ స్టేషన్ను నిర్మించింది ఎన్టీఆరేనని ఆయన అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం తర్వాతనే తెలంగాణ పేదలకు వరిబువ్వ తినే అదృష్టం కలిగిందని రేవంత్ రెడ్డి తన వ్యాసంలో అన్నారు.
"1969లో ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత చల్లారిపోయినా, ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న అసంతృప్తి ఉండేది. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతోందని గుర్తించి, ఆ విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దాలని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం 610 జీవోను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది ఎన్టీఆరే" అని ఆయన అన్నారు.
"దీని తర్వాతనే అందరికీ మరోసారి తెలంగాణ గుర్తొచ్చింది. ప్రాంతీయ వైరుధ్యాలను పట్టించుకోకుండా ఎన్టీఆర్ అమలు చేసిన 610 జీవో కారణంగానే మరోసారి తెలంగాణలో ఉద్యమానికి చలనం వచ్చింది. ఈ కోణం నుంచి చూస్తే ఎన్టీఆర్ కూడా తెలంగాణ ఉద్యమకారుడే. తెలంగాణ చరిత్ర పై చెక్కుచెదరని సంతకం ఎన్టీఆర్" అని రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతికి రాసిన తన వ్యాసంలో అన్నారు.