శుభవార్త: రాజధాని వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా టికెట్
హైదరాబాద్: రాజధాని రైలులో టికెట్ బుక్ చేసుకుంటే చివరి నిమిషం వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులకు శుభవార్త. ఇకపై రాజధాని రైలులో ప్రయాణం చేయలేకపోయామనే చింత అక్కర్లేదు. ఇలా రాజధానిలో వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులకు మహారాజా (ఎయిర్ ఇండియా మస్కట్) స్వాగతం పలకనున్నాడు.
వివరాల్లోకి వెళితే... రాజధాని టికెట్ ఖరారు కాని ప్రయాణికులు కొంతమొత్తం అదనంగా చెలిస్తే వీరిని ఎయిర్ ఇండియా విమానంలో గమ్యస్థానానికి చేర్చే విధంగా ఐఆర్సీటీసీ, ఎయిర్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వానీ లోహాని వివరించారు.
ప్రయాణికులు ఎవరైతే రాజధాని రైలులో ఏ గమ్యస్థానానికి టికెట్ బుక్ చేసుకున్నారో ఆ గమ్యస్థానానికి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ సదుపాయం మరో వారం రోజుల్లో మొదలు కానుంది. ఐఆర్సీటీసీ ద్వారా ప్రయాణికులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు.
అయితే రాజధాని ఏసీ ఫస్ట్క్లాస్ ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని.. సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులు రూ. రెండు వేల వరకు చెల్లిస్తే సరిపోతుందని ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వని లొహానీ తెలిపారు. ఈ సరికొత్త విధానం ద్వారా ఎయిర్ ఇండియా కొత్త పుంతలు తొక్కడం ఖాయమని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎయిర్ ఇండియా విమాన సేవలు మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైలు వెళ్లే రూట్లో ఉన్న విమానాశ్రయాలకు ఎయిర్ ఇండియా నడుపుతున్న సర్వీసులు, వాటిల్లో ఖాళీలను బట్టి ఎంతమంది వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు చోటు లభిస్తుందన్నది ఎప్పటికప్పుడు మారుతుంటుంది.
వెయిటింగ్ టికెట్ రద్దు కోసం 139
రైల్ టికెట్ వెయిట్ లిస్ట్లో ఉందా? ప్రయాణాన్ని ఆపేసి టికెట్ను రద్దు చేసుకోవాలనుకుంటున్నారా? ఇక అది సులువే! జస్ట్ 139కి ఫోన్ చేస్తే సరి. వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీలో ఉన్న ప్రయాణికులు 139కు డయల్ చేసి తమ టికెట్ను రద్దుచేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీలో తెలిపారు.
అయితే రైలు బయలుదేరేందుకు 4 గంటల ముందు వరకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు. బుధవారం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు. రద్దు చేసుకున్న టికెట్ల డబ్బును ప్రయాణం ప్రారంభించే స్టేషన్ నుంచి గానీ, సమీపంలోని అధికారిక శాటిలైట్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం కేంద్రం నుంచి గానీ తిరిగి పొందవచ్చని తెలిపారు.