తెలంగాణ అసెంబ్లీ గరం: సభలో విపక్షాల సభ్యుల బైఠాయింపు, మార్షల్స్తో తరలింపు
హైదరాబాద్: సమావేశం వాయిదా పడిన తర్వాత కూడా ప్రతిపక్షాల సభ్యులు శాసనసభలోనే కూర్చుని ప్రతిపక్షాల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో బుధవారం సాయంత్రం తెలంగాణ శాసనసభలో వేడివాతావరణం చోటు చేసుకుంది. బుధవారంనాడు జరిగిన చర్చలో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని ప్రతిపక్షాల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, వామపక్షాల సభ్యులు సభలో బైఠాయించడంతో మంత్రులు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఛేంబర్లో సమావేశమయ్యారు. మజ్లీస్ పార్టీ సభ్యులు తప్ప మిగతా పార్టీల సభ్యులంతా సభలోనే బైఠాయించారు.
దాంతో మార్షల్స్ రంగప్రవేశం చేశారు. సభలో బైఠాయించిన సభ్యులను వారు ఎమ్మెల్యే క్వార్టర్స్కు బస్సులో తరలించారు. మంత్రుల ప్రవేశద్వారం నుంచి వారిని తీసుకుని వెళ్లారు. మీడియా ప్రతినిధులను పోలీసులు శాసనసభ ఆవరణలోకి అనుమతించలేదు.
రైతుల రుణాలను ఒకే దఫా మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అంతకు ముందు ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై కెసిఆర్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు శాసనసభ నుంచి వెళ్లేది లేదని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును అడిగి సంబంధిత మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని జానా రెడ్డి పట్టుబట్టారు.
కాగా, శాసనసభ ద్వారా రైతుల్లో భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శాసనసభ లో రైతు సమస్యలపై చర్చల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ వన్టైం సెటిల్మెంట్ సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నమని తెలిపారు.
బీజేపీ నేతలు కేంద్రం నుంచి రూ.8వేల కోట్ల అడ్వాన్స్ గ్రాంట్ ఇప్పిస్తే రైతులకు వన్టైమ్ చేస్తమని అన్నారు. కేంద్రం పంటలకు కనీస మద్దతు ధర పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవలే కేంద్రం బీహార్కు అడ్వాన్స్ గ్రాంట్స్ ఇచ్చిందని..ఏ మేనిఫెస్టో పెట్టారని బీహార్కు ప్యాకేజీని ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు ఇబ్బంది ఉంటే కేంద్రం రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.