కొడుకు, అల్లుడి శాఖలకే: పెదవి విరిచిన విపక్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన విపక్షాలు స్పందించాయి. బడ్జెట్ మొత్తం అంకెల గారడీ అని, సినిమా స్క్రిప్ట్లా ఉందని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించాయి. బడ్జెట్ అంతా సినిమా స్ర్కిప్టులా ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
ఇది పసలేని బడ్జెట్ అని, అంతా మాటల గారడి అని, నిధుల సమకూరత పైన స్పష్టత లేదని డీకే అరుణ అన్నారు. అంకెల గారడి అని, గత బడ్జెట్ నిధులను ప్రభుత్వం సగం కూడా ఖర్చు చేయలేదని, ఇప్పుడేమో కేంద్రం నుండి రావాల్సిన నిధులు అందలేదని నెపం వేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అల్లుడు, కొడుకు శాఖలకే ఎక్కువ నిధులు కేటాయించారన్నారు.
బడ్జెట్ అంతా అంకెల గారడీ అని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఉపకార వేతనాల ఊసే లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రకటన చేయలేదన్నారు.
తెలంగాణ బడ్జెట్ దారుణంగా ఉందని, ఇది మోసపూరిత బడ్జెట్ అని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. సంక్షేమానికి కోతలు విధించారని ఆరోపించారు. ఆర్థిక మంత్రిది ఊకదంపుడు ప్రసంగమని ఎద్దేవా చేశారు.