హైకోర్టు బ్రేక్, ఓయూలో బీఫ్ ఫెస్టివెల్ టెన్షన్: భారీ బందోబస్తు, రిజిస్ట్రార్ హెచ్చరిక
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రేపు (గురువారం 10వ తేదీ) కొందరు విద్యార్థులు తలపెట్టిన బీఫ్ ఫెస్టివెల్ వేడెక్కిస్తోంది. బీఫ్ ఫెస్టివెల్ పైన విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సమూహాలుగా విడిపోయారు. ఇది రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.
బీఫ్ ఫెస్టివెల్ను నిర్వహించేందుకు అనుమతి లేదని, ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది. బీఫ్ ఫెస్టివెల్ నిర్వాహకులకు కోర్టులో చుక్కెదురైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని చెబుతున్నారు. దానిని ఆపే ప్రసక్తి లేదని చెబుతున్నారు.
కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని చెబుతూనే, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని అంటున్నారు. కోర్టు ఆదేశాలు గౌరవిస్తామని, మేం కూడా కేసు వేస్తామని చెబుతున్నారు. ఎవరు అడ్డువచ్చినా బీఫ్ ఫెస్టివెల్ జరిపి తీరుతామని చెబుతున్నారు. బీఫ్ ఫెస్టివెల్ను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
తమకు నోటీసులు అందాకే కోర్టు నిర్ణయం గురించి ఆలోచిస్తామని, పైకోర్టుకు వెళ్తామని చెప్పారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేడెక్కింది. గురువారం నాడు ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని చాలామంది భయపడుతున్నారు. కోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
విద్యార్థులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివెల్కు ఎలాంటి అనుమతి లేదని డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు. హైకోర్టు తీర్పుపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ హర్షం వ్యక్తం చేశారు.
బీఫ్ ఫెస్టివెల్ నిర్వహిస్తామని ఓ వర్గం చెబుతుండగా, వద్దని మరికొందరు విద్యార్థులు సూచిస్తున్నారు. కావాల్సింది బీఫ్ ఫెస్టివెల్ కాదని, ఉద్యోగాల ఫెస్టివెల్ అని ఇంకొందరు చెబుతున్నారు. హిందుత్వవాదులు కూడా బీఫ్ ఫెస్టివెల్ పైన మండిపడుతున్నారు.
బీఫ్ ఫెస్టివెల్కు కౌంటర్గా ఇంకొందరు పోర్క్ ఫెస్టివెల్కు సిద్ధమయ్యారు. బీఫ్, పోర్క్ ఫెస్టివెల్లు ఇళ్లలో లేదా వేరే చోట తినాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇదివరకే ప్రకటించారు. బీఫ్ ఫెస్టివెల్ పేరుతో కొందరు రెచ్చగొట్టి, ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీఫ్ ఫెస్టివెల్, పోర్క్ ఫెస్టివెల్ అని పోటీ పడుతూ జీవహింస తగదని పెటా చెబుతోంది.
బీఫ్ ఫెస్టివెల్ పై ఓయు రిజిస్ట్రార్ హెచ్చరిక
బీఫ్ ఫెస్టివెల్ నిర్వహించవద్దని ఓయు రిజిస్ట్రార్ చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు ఫెస్టివెల్లో పాల్గొంటే అడ్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.