ఓయూ ప్రిన్సిపాల్ కార్యాలయంపై విద్యార్థుల దాడి: ప్రిన్సిపాల్కు గాయాలు
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డబుల్ పీజీ విద్యార్థులకు మెస్ కేటాయింపు వ్యవహారం దాడులకు దారితీసింది. మెస్ బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో గత విద్యాసంవత్సరం చివరలో మెస్లు మూసివేసే పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ ఏడాది డబుల్ పీజీ వారికి మెస్ కేటాయించేందుకు అధికారులు నిరాకరించారు.
ఇదే విషయమై కొన్నిరోజులుగా విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నర్సింగ్రావును ఓయూజేఏసీ నాయకుడు మానవతారాయ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కలిశారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్తో వాదనకు దిగారు.
సుమారు 30మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ తలకు గాయాలయ్యాయి. అక్కడి ఫర్నీచర్, కంప్యూటర్, ఫోన్ ధ్వంసమయ్యాయి. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన ప్రిన్సిపాల్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, జియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన ప్రొఫెసర్ నర్సింగ్రావు మూడు రోజుల క్రితమే ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించారు.
కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ సీఐ అశోక్రెడ్డి తెలిపారు. మానవతారాయ్, సంపత్, శేఖర్, శ్రీనివాస్, కిరణ్, సైదానాయక్, శ్యామ్సాగర్, సూర్యం అనే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.