సెటైర్లు రాస్తాం, తేలిగ్గా తీసుకోవాలి: స్మితా సబర్వాల్ ఇష్యూపై ఔట్లుక్
హైదరాబాద్: తెలంగాణ ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదంపై ఔట్లుక్ మ్యాగజైన్ కప్పదాటుగా వ్యవహరించింది. చెప్పీచెప్పనట్లుగా క్షమాపణలు చెబుతూ తన చర్యను సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. తాము సర్వసాధారణంగానే తమ పత్రికలో కొన్ని సెటైర్లు రాస్తామని, అయితే అందులో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని వివరించింది. దాన్ని తేలిగ్గా తేసుకోవాలని సూచించింది.
ది బోరింగ్ బాబు అనే కథనంలో తాము ఎవరి పేర్లను కూడా పేర్కొనలేదని, అయినా తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసు పంపించారంటూ కొన్ని వార్తాపత్రికలు, టీవీ న్యూస్ చానెళఅలు, వెబ్సైట్లు చెప్పాయని ఔట్లుక్ వివరించింది.
మీడియా గందరగోళం ప్రారంభమై 36 గంటలు గడిచినా తమకు మాత్రం ఏ విధమైన నోటీసు రాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూడా తమ పత్రిక ప్రతినిధిపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఆమెపై దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఔట్లుక్ తన కథనంలో తెలిపింది.
ప్రస్తుత సున్నితమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ కథనం మొత్తాన్ని తాము తొలగించామని చెప్పింది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినట్లయితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. గత 20 ఏళ్లుగా మానవ హక్కులు, మహిళల హక్కులు, మైనారిటీ హక్కులు, వాక్ స్వాతంత్ర్యాలను కాపాడుతూ వచ్చామని, ఈ విషయం తమ పాఠకులందరికీ తెలుసునని ఔట్లుక్ వివరణ ఇచ్చుకుంది.