ఆక్సిజన్కు రూ.150 లంచం.. వ్యక్తి మృతి: ఫ్యామిలికీ రేవంత్ రెడ్డి సాయం
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కోసం రూ.150 లంచం ఇవ్వలేక ప్రాణాలు పోగొట్టుకున్న మహబూబ్నగర్ జిల్లా లింగాల మండలానికి చెందిన కృష్ణ నాయక్ కుటుంబ సభ్యులను టిడిపి నేత రేవంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.
కృష్ణ కుటుంబానికి రూ.50వేల ఆర్థికసాయం అందించారు. కృష్ణకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒక పాపను ఆరో తరగతి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా చదువు చెప్పిస్తామన్నారు. అసెంబ్లీలో కృష్ణ అంశాన్ని లేవనెత్తుతానని రేవంత్ తెలిపారు.
కాగా, అత్యవసర వైద్యం కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి వచ్చిన పేదరోగి కృష్ణ నాయక్ను ఆసుపత్రిలోని లంచగొండితనం, నిర్లక్ష్యం పొట్టన బెట్టుకున్నాయి. తన భర్త ఊపిరి తీసుకోలేక నరకయాతన పడుతున్నాడని.. ఆక్సిజన్ అందించి కాపాడాలని ఆయన భార్య కాళ్లా వేళ్లా పడ్డా వార్డు సిబ్బంది కనికరం చూపలేదు.
డ్యూటీ నర్సు చీదరించుకోగా, వార్డుబాయ్ రూ.150 ఇస్తేనే నీ భర్త బతుకుతాడని తెగేసి చెప్పాడు. చివరకు కృష్ణ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. రోగి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణ నాయక్ మహబూబ్నగర్ జిల్లా లింగాల మండలం రాయారాం క్యాంపుకు చెందిన వాడు. అటవీ ప్రాంతంలో కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య కవిత, నలుగురు పిల్లలున్నారు.
అతనికి ఆరోగ్యం విషమించింది. ఆయన తీవ్ర దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతుండటంతో భర్తను తీసుకుని కవిత సోమవారం ఉదయం ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన డ్యూటీ డాక్టర్... తక్షణ వైద్య సహాయం అందించడంతోపాటు నిరంతరం ఆక్సిజన్ అందించాలని సూచిస్తూ ఎంఎం-1 వార్డులో అడ్మిట్ చేసింది. అయితే రాత్రయినా ఆక్సిజన్ పెట్టలేదు.
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కృష్ణ ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో అతడి భార్య కవిత డ్యూటీ నర్సు రీటాకు విషయం చెప్పింది. తన భర్తకు ఆక్సిజన్ పెట్టాలంటూ పదిసార్లకు పైగా కవిత నర్సు వద్దకు వెళ్లింది.
ఈ సమయంలో వార్డు బాయ్ నయీమ్ వచ్చి రూ.150 ఇస్తే ఆక్సిజన్ పెడతానని, లేదంటే నీ భర్త బతకడని చెప్పాడు. తమ వద్ద డబ్బు లేదని, అందుకే ఈ ఆసుపత్రికి వచ్చామని కవిత ఎంత బతిమాలినా వార్డుబాయ్ దయ చూపలేదు.
ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతతో కృష్ణా మృతి చెందాడు. వార్డులోని ఇతర రోగులు, రోగుల బంధువులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బైఠాయించారు. తమ ప్రాణాలను కాపాడాలంటూ ఆవేదనతో నినదించారు.