అరాచకాలు: ఫ్యాక్షనిస్టంటూ తమ్మినేనిపై పల్లా ఘాటు వ్యాఖ్యలు
ఖమ్మం: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంపై టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలేరు ఉప ఎన్నికల్లో సీపీఎం పార్టీ అరాచకాలు హద్దు మీరుతున్నాయని ఆయన విమర్శించారు.
తమ్మినేని వీరభద్రంపై జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పిడమర్తి రవి ఆదివారం ఫిర్యాదు చేశారు. తెల్లార్పల్లిలో టీఆర్ఎస్కు ఇతర ప్రాంతపు ఏజెంట్లను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సొంతూరు తెల్లార్పల్లిలో తమ్మినేని వీరభద్రం ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భయభ్రాంతులకు గురిచేస్తూ ఇరత పార్టీల ఏజెంట్లను తమ్మినేని వీరభద్రం అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.
గత మూడు దశాబ్దాలుగా తెల్లార్పల్లిలో 116, 117, 118 బూతుల్లోకి ఇతర పార్టీల ఏజెంట్లను అనమతించడంలేదని అన్నారు. తమ్మినేని అరాచకాలను అడ్డుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకుంటూ సొంతూరులో ఇతర పార్టీల ఏజెంట్లను అడ్డుకోవడం ఏం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇతరులకు నీతులు చెబుబుతన్న సీపీఎం పాలేరులో అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.