రెచ్చగొట్టేందుకే కోదండరాం నిరుద్యోగ ర్యాలీ.. హింసకు కుట్ర: పల్లా రాజేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలోని నిరుద్యోగులు కోదండరాం మాయలో పడవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి యువతకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ర్యాలీ పేరుతో హింసను రెచ్చగొట్టే కుట్రకు తెరలేపారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
సోమవారం నాడు టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లుతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరుతో గత 15రోజులుగా తెలంగాణ అంతటా తిరుగుతున్న కోదండరాం.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉద్యోగాల కల్పన విషయంలో కోదండరాం రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే అందులో ఇప్పటికే 2లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. మిగతా లక్ష పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులు కోదండరాం మాయలో పడవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి యువతకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన శక్తులే ఇప్పుడు కోదండరాం ర్యాలీకి మద్దతుగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
దిగ్విజయ్ వ్యాఖ్యలను ఖండించిన బోడకుంట్ల:
ఇటీవల సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఖండించారు. దిగ్విజయ్ సింగ్ ఓ వెలిసిపోయిన నాయకుడని ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు కేసీఆర్ ను ప్రశంసించిన దిగ్విజయ్ ఇప్పుడు ఆ మాటలు మరిచిపోయారని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. కాంగ్రెస్ నేతలు ఇదే ఆరోపణలను కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో విపక్ష హోదాను కోల్పోవడం ఖాయమన్నారు.