నష్టం జరిగినా మౌనమేనా?: కెసిఆర్పై పాల్వాయి
హైదరాబాద్: తెలంగాణకు నీటి కేటాయింపులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ నిర్మిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మౌనంగా ఎందుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు నష్టమని పాల్వాయి అన్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమతో పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందన్నారు. గోదావరి జలాలు వినియోగించుకోవడంపై సిఎం కెసిఆర్ దృష్టి సారించాలన్నారు. పాలమూరు ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా రాదని సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ తేల్చిందన్న విషయాన్ని పాల్వాయి గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేలకుండా ప్రాజెక్టులను రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రమే నష్టపోతుందని పాల్వాయి అన్నారు.
తెలంగాణ అభివృద్ధి విషయంలో కెసిఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని పాల్వాయి గోవర్దన్రెడ్డి విమర్శించారు. పట్టిసీమపై చర్చించేందుకు అఖిలపక్ష కమిటీ వేయాలని, గోదావరిపై ఏడు ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.