అసలే పేదరికం, అందులోనూ అంధత్వం: తల్లిదండ్రుల మృతితో ఒంటరైన దివ్యాంగులు
అసలే పేదరికం.. అందులోనూ అంధత్వం.. ఒకరు.. కాదు ఇద్దరు కాదు నలుగురు విధి వంచితులు. అమ్మానాన్న ఉన్నన్ని రోజులూ వారి సంరక్షణలో హాయిగా గడిపారు. ఇప్పుడు వారు కాలం చేయడంతో అనాథలుగా మిగిలారు.
వరంగల్: అసలే పేదరికం.. అందులోనూ అంధత్వం.. ఒకరు.. కాదు ఇద్దరు కాదు నలుగురు విధి వంచితులు. అమ్మానాన్న ఉన్నన్ని రోజులూ వారి సంరక్షణలో హాయిగా గడిపారు. ఇప్పుడు వారు కాలం చేయడంతో అనాథలుగా మిగిలారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కాజీపేట మండలం, 35వ డివిజన్ కడిపికొండకు చెదిన విశ్రాంత ఉద్యోగి కిన్నెర మంకయ్య (75), కొమురమ్మలకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కుమారులు సదానందం, రాంబాబు కాగా మరో ఇద్దరు కుమార్తెలు సత్యవతి, హేమలత.
నలుగురూ పుట్టుకతోనే అంధులు అయితేనేం కన్నపేగుపై మమకారం వీడని ఆ తల్లిదండ్రులు 48 సంవత్సరాలుగా అందరినీ కడుపులో పెట్టుకొని ప్రాణంగా సాదుకున్నారు. అయితే వృద్ధాప్యం కారణంగా ఏడాదిన్నర క్రితం తల్లి మరణించగా సోమవారం తండ్రి మరణించాడు. ఇన్నేళ్లు వారి నీడన పెరిగిన ఆ నలుగురు ఇప్పుడు దిక్కులేని వారిగా మిగిలారు.
చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉండేందుకు సొంత గూడు లేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుని గట్టిగా రోదించేందుకు కళ్లు కూడా లేవు.. హృదయ విదారక ఈ పరిస్థితి చూసి కంటతడి పెట్టని స్థానికులు లేరంటే అతిశయోక్తి కాదు. స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రభుత్వ ద్వారా ఈ దివ్యాంగులకు డబుల్ బెడ్రూం మంజూరు చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
అలాగే దివ్యాంగుల తండ్రి కిన్నెర మంకయ్య, రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైరయినందున రైల్వే శాఖ వీరి కేసును ప్రత్యేకమైనదిగా గుర్తించి వీరికి పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.