పార్లమెంటు సమావేశాలు: తెలుగులోనే ఎంపీగా ప్రమాణం చేసిన పసునూరి దయాకర్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన అనంతరం ఇటీవల వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పసునూరి దయాకర్ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆయన తెలుగులోనే ప్రమాణం చేయడం గమనార్హం.
ఆ తర్వాత కొత్తగా పార్లమెంటు సమావేశాలకు హాజరైన పసునూరి దయాకర్కు మిగిలిన సభ్యులు అభినందనలు తెలిపారు. ఇటీవల జరిగిన వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏడో వ్యక్తిగా పసునూరి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా, లోక్సభను స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభను హమీద్ అన్సారీ పార్లమెంటు సమావేశాలను ప్రారంభించారు. అనంతరం దయాకర్ తోపాటు కొత్తగా ఎన్నికైన కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన పార్లమెంటుసభ్యులు, మాజీ సభ్యులకు పార్లమెంటు నివాళులర్పించింది.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ఇతర కార్యక్రమాలు జరగవు. ఈ సమావేశాల్లో తొలి రెండు రోజులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గౌరవార్థం ప్రత్యేక సమావేశాలు, తీర్మానంపై చర్చ జరగనుంది.