పవన్ కళ్యాణ్: బాబుకు సెక్షన్ 8పై షాక్, యాదాద్రిపై కెసిఆర్కు ప్రశంస
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మీడియా ప్రసంగాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశంసించడంతో ప్రారంభించారు. అయితే, హైదరాబాద్లో సెక్షన్ 8పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యల్లో రాజకీయ తటస్తను పాటించడానికి పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నించారు. ఆంధ్రోళ్లు అనే మాట వాడకూడదని తెలంగాణ మంత్రి హరీష్ రావుకి మాత్రమే కాకుండా కెసిఆర్కు కూడా సూచించారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ మంచిది కాదని ఆయన అన్నారు. అయితే, దాన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, కెసిఆర్ను పూర్తిగా ఫోన్ ట్యాపింగ్పై తప్పు పట్టలేదు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అంటూనే హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ శాంతిభద్రతలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
యాదాద్రి నిర్మాణంలో విజయనగరం ఆర్కిటెక్చర్ ఆనందసాయిని పెట్టుకుని తెలుగు జాతి ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారని, దానికి ఎక్కువ ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు. తెలుగు జాతి సమైక్యతా స్ఫూర్తికి తొలి అడుగు వెశారని ఆయన కెసిఆర్ను ప్రశంసించారు. కెసిఆర్ వ్యాఖ్యల తీరును ఆయన తప్పు పట్టారు. పోలీసులు కూడా కొట్టుకుంటున్నారని, ఇది అంతర్యుద్ధానికి దారి తీయవచ్చునని ఆయన అన్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ను సీరియస్గా తీసుకోవాలని అన్నారు. కానీ నేరుగా కెసిఆర్ను తప్పు పట్టలేదు. ఆంధ్ర అనే ప్రాంతం పేరు పెట్టి తెలంగాణ నాయకులు నిందించడాన్ని ఆయన తప్పు పట్టారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవద్దని ఆయన సూచించారు. బహుశా ఆయన ఎబిఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణలో, ఎన్టీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసారం కాకుండా చూడడంపై వ్యాఖ్యానించి ఉంటారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఎసిబికి రెండ్ హ్యాండెడ్గా దొరికిపోవడంపై ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ విషయం కోర్టులో ఉందని చెబుతూ దాటవేశారు. తెలంగాణ ఎంపీలను ఆయన ప్రశంసించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ సమస్యలను ఈ ప్రాంత ఎంపీలు తీసుకుని వెళ్లినంతగా సీమాంధ్ర ఎంపీలు తీసుకుని వెళ్లలేదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఎంపీలకు వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే అలా చేసి ఉంటారని ఆయన అన్నారు.