పవన్ కళ్యాణా లేక ప్యాకేజీ కళ్యాణా: ప్రశ్నించడం మానేశాడన్న సుమన్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మాని, భజన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మంగళవారం విమర్శించారు. ఎంత చేసినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్గా టీడీపీ మారిందన్నారు. పవన్ కళ్యాణా లేక ప్యాకేజీ కళ్యాణా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్కు అనేక విషయాల్లో స్పష్టత లేదని బాల్క సుమన్ అన్నారు. ఓటుకు నోటు కేసును వదిలి ఫోన్ ట్యాపింగ్ పైన మాట్లాడటం విడ్డూరమన్నారు. ట్యాపింగ్ పైన ప్రధాని మోడికి చంద్రబాబు రాసిన లేఖను బయటపెట్టాలన్నారు.
ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నాయని, వారు నిర్మాణాత్మక సహాలు ఇస్తే ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధింగా ఉన్నామన్నారు.
భ్రష్టు పట్టించారు: కొప్పుల
దేశాన్ని భ్రష్టుపట్టించిందే కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడటం కోసమే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తామడిగే ఒక్క ప్రశ్నకూ వారి వద్ద సమాధానం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి దేశమే గర్విస్తోందన్నారు.
కెసిఆర్ కరెంటు పోని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నారన్నారు. 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి మిగులు రాష్ట్రంగా నిలిపేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇలాంటి ఆలోచనలు మీరు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కొప్పుల విమర్శలు గుప్పించారు. మంత్రిగా ఏం చేయని ఉత్తమ్, ఇప్పుడు షాడో కేబినెట్తో ఏం చేస్తారని ప్రశ్నించారు.
సాంకేతిక పరిజ్ఢానం ఉపయోగించుకోవాలి: పోచారం
వ్యవసాయరంగంలో అధిక దిగుబడుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అగ్రి ఫ్యాబ్లెట్ను సచివాలయంలో ఉదయం మంత్రులు కేటీఆర్, పోచారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం పరుగులు తీస్తోందని, ప్రపంచంలోనే వ్యవసాయరంగం చాలా ముఖ్యమైనదన్నారు. అధిక దిగుబడులు పాటించేందుకు ఐటీని ఉపయోగించుకోవాలన్నారు.