దానం రాజీనామా ఆమోదం: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ చేసిన రాజీనామాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆమోదింది. పార్టీ అధిష్టానం సూచన మేరకు దానం నాగేందర్ రాజీనామాకు పీసీసీ ఆమోదం తెలిపింది.
దానం నాగేందర్ రాజీనామాను ఆమోదించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్కు సూచించారు. గతవారంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లలో మాత్రమే గెలుపొందింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తన రాజీమానా లేఖను పార్టీ అధినేత్రి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి తన రాజీనామా లేఖలను పంపించారు.
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శ్యామ్ మల్లేశ్ రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
టాంపరింగ్తో గ్రేటర్ ఫలితాలు తారుమారు: ఉత్తమ్
టాంపరింగ్తో గ్రేటర్ ఫలితాలను తారుమారు చేశారని ఈసీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి లేఖ రాశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని అందులో ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో ప్రింటర్ ఉన్న ఈవీఎంలనే వాడాలని చట్టం చెబుతోందని, కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చలేదని ఆయన ఫిర్యాదు చేశారు. తమ కుటుంబసభ్యుల ఓట్లు కూడా తమకు పోల్ కాలేదని అభ్యర్థులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్కు అవకాశం లేకుండా చూడాలని ఈసీని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. ప్రింటర్లు ఉన్న ఈవీఎంలు వాడకపోతే బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలన్నారు.
ఇదే విషయంపై టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో ప్రింటర్ ఈవీఎంలను ప్రవేశపెట్టాలని లేదా బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలని కోరారు. ఈ రెండు సాధ్యం కాకపోతే ఉపఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేయాలని వినతిపత్రం సమర్పించారు.
వరంగల్ ఉపఎన్నిక సమయంలోనే తమకు ఈవీఎంలపై అనుమానం వచ్చిందని, తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో అది నిజమైందని శ్రవణ్ మీడియాతో అన్నారు. అసలు ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ కు కచ్చితంగా వంద స్థానాలు వస్తాయని కేటీఆర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు.