జాగ్రత్త!: ‘ఒక్కరోజులోనే కోటీశ్వరులు కావాలనుకోవద్దు’
రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కోరుకోకూడదని, దీని వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మ ప్రజలకు సూచించారు.
హైదరాబాద్: రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కోరుకోకూడదని, దీని వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణ డీజీపీ అనురాగ్శర్మ ప్రజలకు సూచించారు. ఎక్కువ రాబడి వస్తుందన్న పథకాలను నమ్మవద్దని, వీటివల్ల మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) ఆధ్వర్యంలో బ్యాంకింగేతర సంస్థల కార్యకలాపాలు-ఖాతాదారుల రక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై బుధవారం తెలంగాణ పోలీసుశాఖ, సీఐడీ విభబాగానికి శిక్షణ నిర్వహించారు. అనురాగ్శర్మ ఇందులో పాల్గొని ప్రసంగించారు.
నకిలీ చిట్ఫండ్లు, గొలుసుకట్టు వ్యాపార పథకాల వంటి ఆర్థిక నేరాల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.
ఆర్థిక నేరాలు, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలు, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ స్కీమ్స్, బోగస్ చిట్ ఫండ్స్పై పోలీసు అధికారులు కూడా అవగాహన కలిగి ఉండాలని డీజీపీ చెప్పారు.
ఇటీవల కాలంలో ఆన్లైన్ పేమెంట్స్, మొబైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరిగినందున నేరాలు కూడా పెరిగే అవకాశం ఉందని, వీటిపైనా దృష్టి సారించాలని అన్నారు. పోలీసులు, నియంత్రణా సంస్థలైన ఆర్బీఐ, సెబీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ మొదలగునవి ఈ విధమైన నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.