కేసీఆర్ ఏరియల్ సర్వే, హెలికాప్టర్ దిగలేదు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం హైదరాబాద్ నగర శివార్లలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్లో బయల్దేరిన ఆయన హరిణవనస్థలి, వనస్థలిపురం, మేడ్చల్ ప్రాంతాల్లోని అటవీ భూములను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. వాస్తవానికి శనివారమే కేసీఆర్ ఏరియల్ వ్యూ ఉన్నప్పటికీ హెలిప్యాడ్లు సిద్ధం కాకపోవడంతో వాయిదా వేశారని సమాచారం.
దీంతో వనస్థలిపురం ఆటోనగర్, హయత్నగర్ బాలాజీ గార్డెన్స్, మేడ్చల్లోని సీఎంఆర్ కాలేజీ ప్రాంగణంలో రాత్రికి రాత్రి అధికారులు హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తునూ ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్తో పాటు ఉన్నతాధికారులు ఆటోనగర్ హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హరిణవనస్థలిలోని 3605 ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఆకాశంలో ఒక పర్యాయం తిరిగిన కేసీఆర్ హెలికాప్టర్ కిందికి దిగకుండానే వెళ్లిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేడ్చల్, కండ్లకోయ అటవీ ప్రాంతంలో 660 ఎకరాలను విహంగ వీక్షణం ద్వారానే పరిశీలించారు. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగా సీఎం ఎక్కడా కిందకు దిగకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది.
కేసీఆర్ విహంగ వీక్షణం
అటవీ భూములకు సంబంధించి హెలికాప్టర్లోనే ఉన్న అటవీశాఖ అధికారులు నాగభూషణం, ప్రత్యేకాధికారి భూపాల్రెడ్డి సీఎంకు వివరాలు వెల్లడించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.
కేసీఆర్ విహంగ వీక్షణం
సీఎం కేసీఆర్ తమ ప్రాంతానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు హెలిప్యాడ్ల వద్దకు తరలివచ్చారు. నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా వచ్చిన సీఎం.. హెలికాప్టర్ దిగకుండానే వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు నిరాశకు గురయ్యారు.
కేసీఆర్ విహంగ వీక్షణం
హైదరాబాద్ హరితహారం కావాలని, అటవీ భూములను కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ విహంగ వీక్షణం
ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. భూముల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.