జాగృతి కమిటీ రద్దు, కవితకు అభినందన(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలుత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం తెలిపారు. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను, అనుబంధ సంఘాలను రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
తెలంగాణ భవన్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తలెంగాణ జాగృతి సంస్థ కీలకంగా వ్యవహరించిందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణమే పెద్ద సవాలు అని ఆమె అన్నారు. ఈ సవాలును తెలంగాణ జాగృతి స్వీకరిస్తుందని చెప్పారు. పునర్నిర్మాణ కార్యాచరణను దృష్టిలో పెట్టుకొనే జాగృతి కార్యవర్గాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు.
ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారికి నూతన కార్యవర్గంలో ప్రధాన్యం ఇస్తామని ఆమె తెలిపారు. జాగృతి కార్యకర్తలు, స్థానిక ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. నవంబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు తెలంగాణ జాగృతి సభ్యత్వ నమోదు కార్యకర్మాన్ని చేపడతామన్నారు. వివిధ జిల్లాలకు చెందిన జాగృతి కార్యకర్తలు, నాయకులు ఎంపీగా ఎన్నికైన కవితను అభినందించారు.