ఆస్పత్రిలో రాజయ్య: ఏమిటీ వేడి? (పిక్చర్స్)
హైదరాబాద్: ఉద్వాసనకు గురైన మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య మంగళవారం సాయంత్రం అపోలో ఆస్పత్రిలో చేరడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు అది ఓ అస్త్రంగా పనికి వచ్చింది. కానీ, కొద్దిసేపటికే సద్దుమణిగింది. అయితే, అసలేం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.
పిలిచి వివరణ కోరకుండా, రాజీనామాకు అవకాశం లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారనే మాట వినిపించింది. ఆయన సన్నిహితులు చెబుతున్న విషయాల ప్రకారం - పదవి పోయిన క్షణం నుంచి దాదాపుగా ఇంటికే పరిమితం అయ్యారు. సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. తిండి సరిగా తినటంలేదు.
ఐసియులో రాజయ్య
అపోలో ఆస్పత్రిలో మూడున్నర గంటలపాటు ఐసీయూలో రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ టి.సూర్యప్రకాశ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది.
అస్వస్థతతో రాజయ్య
గుండె ఎడమవైపు వాల్వ్లో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. బీపీ, షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. 24 గంటలపాటు సీనియర్ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు భావించారు.
అభిమానుల ఆందోళన
అంతకుముందు..ఆయన అభిమానులు, సన్నిహితులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరారు. ‘‘సీఎం కేసీఆర్ డౌన్ డౌన్' అంటూ ఆందోళన చేశారు.
మోత్కుపల్లి పరామర్శ
అపోలో ఆస్పత్రిలో చేరిన తెలుగుదేశం తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు. కెసిఆర్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోడ్డుపై బైఠాయించారు..
రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పలు పార్టీలు, సంఘాల నేతలు వారికి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర మంత్రి చందూలాల్ ఆస్పత్రికి చేరుకొని రాజయ్య ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు.
జూపూడి ప్రభాకర రావు పరామర్శ
అపోలో ఆస్పత్రిలో చేరిన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యను తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాల వర్గానికి చెందిన నేత జూపూడి ప్రభాకర్ రావు పరామర్శించారు.
తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత
మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అపోలో ఆస్పత్రిలో చేరారనే వార్త ఒక్కసారిగా గుప్పు మంది. దీంతో ఆస్పత్రికి పెద్ద యెత్తున నాయకులు, ఆయన అభిమానులు చేరుకున్నారు.
మధుయాష్కీ పరామర్శ
కాంగ్రెసు తెలంగాణ నేత మధు యాష్కీ అపోలో ఆస్పత్రి టి. రాజయ్యను పరామర్శించారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆయన కెసిఆర్ను దుమ్మెత్తిపోశారు.
వైద్య పరీక్షలు..
అపోలో ఆస్పత్రిలోని ఐసియులో టి. రాజయ్యకు వైద్యులు మూడున్నర గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో తెలంగాణ మంత్రి పద్మారావు ఆయనను పరామర్శించారు.
రోదనలు కూడా...
టి. రాజయ్య అపోలో ఆస్పత్రిలో చేరడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.
రాత్రి డిశ్చార్జీ
ఇరవై నాలుగు గంటల పాటు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినా వినకుండా రాజయ్య ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. దాంతో రాజయ్య కోరిక మేరకు ఆయనను డిశ్చార్జి చేశారు.
విచారణ జరిపించండి..
తనపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును వినయపూర్వకంగా కోరుతున్నట్లు రాజయ్య చెప్పారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు.
అక్కడే మీడియా..
ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత అక్కడే రాజయ్య మీడియాతో మాట్లాడారు. తండ్రి లాంటి కెసిఆర్ తనపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు.
ఎలాగో నెట్టుకొచ్చా...
నిజానికి, అంతకుముందే ఆస్పత్రికి వద్దామనుకున్నా. అభిమానులు, కార్యకర్తలు మరోలా అనుకుంటారని ఇన్నా ళ్లూ ఎలాగో నెట్టుకువచ్చానని, ఇప్పుడు ఒక్కసారిగా చెమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు తనను ఆస్పత్రిలో చేర్పించారని రాజయ్య చెప్పారు.
పరామర్శించటానికి వచ్చిన బంధువులు, సన్నిహితులు, అభిమానులతో మాట్లాడుతూ రాత్రి పొద్దుపోయేవరకూ గడుపుతున్నారు. కంటి మీద కునుకు లేదు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రులందరినీ, ఆ తర్వాత కేసీఆర్ను కలిసి తన వాదన వినిపిద్దామని రాజయ్య అనుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మంత్రులు జిల్లాల పర్యటనలో ఉండటంతో మంగళవారం ఆయన ఎవరినీ కలవలేకపోయారు.
మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్లోని స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆరు గంటల ప్రాంతంలో కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రాజయ్యను ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం మరోసారి రాజయ్య ఆస్పత్రికి వచ్చారు.