తెలంగాణకు విజయమ్మ: ఎపికి జగన్ (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో బాధ్యతల పంపిణీ జరిగినట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలను అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తే, తెలంగాణ బాధ్యతలను తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు మోసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా వైయస్ జగన్ ఉన్నప్పటికీ తెలంగాణ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యవహరిస్తున్నారు. వైయస్ విజయమ్మను ముందు పెట్టి తెలంగాణలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే పని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చూసే అవకాశం ఉంది.
ఆదివారంనాడు హైదరాబాదులోని లోటస్ పాండులో తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని వైయస్ విజయమ్మ ప్రారంభించడాన్ని బట్టి ఆ విషయం అర్థమవుతోందని అంటున్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గుంటూరుకు తరలించే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ స్థితిలో పూర్తి స్థాయిలో జగన్ ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల పరామర్శ యాత్రలు చేపట్టారు. మరోసారి విజయమ్మ, షర్మిల తెలంగాణలో పర్యటించే అవకాశాలు కూడా లేకపోలేదనే మాట వినిపిస్తోంది. ఏది విధంగా కొంత మేరకైనా తెలంగాణలో ఉనికిని కాపాడుకోవాలనే పట్టుదలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.
వైయస్ విజయమ్మ ఇలా..
హైదరాబాదులోని లోటస్ పాండులో వైయస్ విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆదివారంనాడు ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప, చేతల్లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆరోపించారు.
వైఎస్ పాలన భేష్
అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన సాగించారని ఆమె గుర్తు చేశారు.
సంక్షేమ పథకాలే..
వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని, పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తేడాల్లేవు..
ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైయస్సార్లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైయస్సార్ సంకల్పమని అన్నారు. వైయస్సార్కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు.
తెలంగాణలో పోటీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడేలా పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అందరం కష్టపడి పనిచేద్దామని, తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని పొంగులేటి చెప్పారు.