కేసీఆర్కి ఎన్టీఆర్ స్టేడియం షాక్: పిల్లలకు వద్దా?
హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియం స్థలాన్ని కళాభారతి కోసం కేటాయించడం పిల్లల హక్కును హరించడమేనని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 14 ఏకరాల ఎన్టీఆర్ స్టేడియాన్ని తెలంగాణ కళాభారతి ఏర్పాటు నిమిత్తం సాంస్కృతిక శాఖకు అఫ్పగిస్తూ, గత నెల 13న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
ఇందిరా పార్కు పాదాచారుల సంఘం అధ్యక్షులు సుధాకర్ రావు యాదవ్ దీనిని దాఖలు చేశారు. స్టేడియం మైదానాన్ని తీసుకోవడం ఆ స్థలాన్ని ఆటల కోసం వినియోగించే వేలాది మంది పిల్లల హక్కులను హరించడమే అవుతుందన్నారు.
దిగువ, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతంలో ఈ మైదానం ఉందని, వారికి, వారి పిల్లలకు ఉపయోగకరంగా ఉందన్నారు. చుట్టు పక్కల పాఠశాలల్లో ఆట స్థలాలు లేని విద్యార్థులకు ఎన్టీఆర్ స్టేడియం ఉందని చెప్పారు. ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించే అధికారం జీహెచ్ఎంసీకి లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకమండలి ఇప్పుడు లేదని, ప్రత్యేక అధికారి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.
సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి, రవీంద్ర భారతి, కళాభవన్, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, హరిహర కళాభవన్, శిల్ప కళావేదిక, శిల్పారామం, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ తదితరాలు ఉన్నాయని, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో త్యాగరాయ గాన సభ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసి కళ్యాణ మండపం తదితరాలు ఉన్నాయన్నారు.