న్యూఢిల్లీ: బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అని, ఒక మంచి టీచర్ ఏం చేయగలరో ఆయన నిరూపించాడని కొనియాడారు. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన పీవీ సింధూ ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో రజత పతకాన్ని మన దేశానికి అందించిన విషయం తెలిసిందే.
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. గోపీచంద్ ను ఓ క్రీడాకారుడిగా కంటే టీచర్గా గుర్తిస్తేనే మంచిదని తన అభిప్రాయంగా చెప్పారు. ఒలింపిక్స్లో ఇండియన్ డాటర్స్ మంచి విజయాలు అందించారని పొగిడారు.
ఈ సందర్భంగా పీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తోపాటు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఇతర క్రీడాకారులకు మోడీ అభినందనలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
గంగా నది శుభ్రత కోసం ముందుకొచ్చి గొప్ప ప్రమాణం చేసిన నదీ పరిహవాక ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. మురుగునీటిని గంగానదిలోకి వదిలేయడం వెంటనే ఆపేయాలని కోరారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, గణేశ్, దుర్గా ఉత్సవాలకు మట్టితో చేసిన వినాయకులను ఉపయోగించాలని, ప్లాస్టిక్ మిళిత రసాయనలతో చేసిన విగ్రహాలను వాడొద్దని చెప్పారు.
దేశ ప్రజలందరిలో ఐక్యతా భావం పురికొల్పేందుకు నాడు బాలగంగాదర్ తిలక్ ఈ గణేశ్ ఉత్సవాలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇక భారత రత్న మదర్ థెరిసాను కూడా ప్రధాని మోడీ జ్ఞప్తికి తెచ్చారు. ఆమె సేవలు అపురూపం అని కొనియాడారు. సెప్టెంబర్ 4న ఆమెను దైవ దూత(సెయింట్ హుడ్)గా ప్రకటించనున్నారని, ప్రతి భారతీయుడు ఈ విషయాన్ని గౌరవంగా భావించాలని చెప్పారు.
కాగా, కాశ్మీర్ లో ఆందోళనకర పరిస్థితులపై కూడా మోడీ మాట్లాడారు. అక్కడి యువతను రెచ్చగొడుతున్న వారు.. ఈ అమాయక యువతకు ఏదో ఓ రోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. కాశ్మీర్లో ఒక్క ప్రాణనష్టం జరిగినా అది దేశం మొత్తానికి నష్టం జరిగినట్లేనని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి యువత అనవసర ప్రలోభాలకు గురికావొద్దని చెప్పారు. కాశ్మీర్ సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే.