చాక్లెట్ దొంగతనం: రాత్రంతా పిఎస్లో బాలుడ్ని..
వరంగల్: అభంశుభం తెలియని ఓ ఐదో తరగతి విద్యార్థిపై చాక్లెట్ దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఓ మొద్దుకు కట్టేసి ఉంచారు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది.
తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెంన పదేళ్ల బాలుడు వీరన్న, మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలిసి, ఓ దుకాణం వెళ్లాడు. షాపులో వ్యక్తులు కనిపించకపోవడంతో వారిని పిలుచుకుంటూ లోపలికి వెళ్లాడు. ఇంతలోనే అతనితోపాటు వచ్చిన ఇద్దరు విద్యార్థులు షటర్ లాగే పారిపోయారు.
లోపల చిక్కుకున్న వీరన్న షటర్ను కొడుతూ కేకలు వేయడంతో పక్కనున్న వారితోపాటు దుకాణం యజమాని కూడా అక్కడికి వచ్చాడు. దుకాణంలో చాక్లెట్ దొంగతనానికి వచ్చావా? అంటూ బాలుడ్ని దూషించిన యజమాని అతడి జేబులోని రూ. 300 తీసుకున్నాడు. అంతేగాక అతడ్ని పోలీసులకు అప్పగించాడు.
మందలించి వొదిలేయాల్సిన పోలీసులు, అతడ్ని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న వార్డెన్.. పిఎస్కు వెళ్లి బాలుడ్ని వదలాలని కోరినా పోలీసులు వినలేదు. రాత్రంతా స్టేషన్లోనే ఓ మొద్దుకేసి బాలుడ్ని కట్టేశారు. మీడియాకు ఈ విషయం తెలియడంతో బాలుడ్ని వార్డెన్కు అప్పగించారు పోలీసులు.
కాగా, బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనురాధారావు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడ్ని దుంగకు బంధించిన ఘటనలో ఎస్సై కృష్ణకుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో.. విచారణకు ఆదేశించారు.