హాలో...నేను గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకుని...ల్యాండ్ సెటిల్ చేసుకో..లేకపోతే ......
180 గజాల స్థలం కోసం ఓ వ్యక్తి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పెద్ద కొడుకు అవతారం ఎత్తాడు. అంతేకాదు భూమి యజమానిని బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ తో భయాందోళనలకు గురైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.దీంతో
హైదరాబాద్: 180 గజాల స్థలం కోసం ఓ వ్యక్తి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పెద్ద కొడుకు అవతారం ఎత్తాడు. అంతేకాదు భూమి యజమానిని బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ తో భయాందోళనలకు గురైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.దీంతో అసలు విషయం బయటపడింది.
పాత బోయిన్ పల్లిలోని సర్వేనెంబర్ 111లో ఫ్లాట్ నెబర్ 36 లో 180 గజాల స్థలాన్ని శ్రీధర్ రావు అనే వ్యక్తి 1991 లో కొనుగోలు చేశాడు. ఇదే స్థలాన్ని 2002 లో లక్ష్మణమూర్తి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు.
అయితే లక్ష్మణమూర్తికి తొలుత ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన శ్రీధర్ రావు అనే వ్యక్తి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పెద్ద కొడుకు వివేక్ పేరుతో ఇటీవల ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించాడు.
ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాలని హెచ్చరించాడు. రెండు రోజుల పాటు గడువిచ్చి సెటిల్ చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు దగ్గరలో ఇల్లు ఉందని ఆదివారం వచ్చి మాట్లాడాలని సూచించాడు. తన పీఏ కిరణ్మయిని అడిగి పోన్ నెంబర్ తీసుకోవాలని సూచించాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం నాడు శంకరంపేటలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణమూర్తికి వివేక్ పేరిట మరోసారి శ్రీధర్ రావు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని పెద్దది చేసుకోవద్దని సూచించాడు.ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, కార్పోరేటర్ నర్సింగ్ యాదవ్ అండచూసుకొని ఇష్టం వచ్చినట్టు చూస్తే బాగుండదని హెచ్చరించాడు.
180 గజాల స్థలమే కదా, ఐదారు ఎకరాల భూమి కాదు కదా అంటూ ఆయన ఫోన్ లోనే లక్ష్మణమూర్తిని బెదిరించాడు. ఫోన్ చేస్తే మేడ్చల్ కలెక్టర్ గంటలో ఇంటికి వస్తారని చెప్పారు. ఆదివారం నాడు జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి రావాలని హుకుం జారీ చేశాడు శ్రీధర్ రావు.
ఈ విషయమై లక్ష్మణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు వివేక్ అమెరికాలో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే లక్ష్మణమూర్తికి వచ్చిన ఫోన్ ఆధారంగా శ్రీధర్ రావు అనే వ్యక్తి ఫోన్ చేశాడని పోలిసులు గుర్తించారు.
హిమాయత్ నగర్ నుండి ఈ ఫోన్ చేశారని పోలీసులు గుర్తించారు. శ్రీధర్ రావును పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు.అయితే ఈ స్థలాన్ని 1991లోనే తాను కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయమై మాట్లాడుదామని చెప్పినా లక్ష్మణమూర్తి వినకపోవడంతోనే తాను ఇలా చేసినట్టుగా ఆయన చెప్పారు.