ఆ హత్యలతో నయీంకు లింక్ ఉందా?: 'వైయస్సార్' ఇంట్లోనే దందాలు!
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం తన వద్ద పని చేసే నస్రీన్తో పాటు మరో అమ్మాయిని హత్య చేశాడా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తన వద్ద పని చేసే నస్రీన్.. చెప్పిన మాట వినలేదని నయీం చంపేసి నార్సింగి మంచిరేవుల శివారులో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా, మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్లో మరో అస్తిపంజరాన్ని గుర్తించారని తెలుస్తోంది. నయీం కుటుంబ సభ్యులు, ఆయన వద్ద పని చేసిన ఫర్హానా, అఫ్సానాలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వారు షాద్ నగర్లో మరో అమ్మాయిని హత్య చేసినట్లుగా చెప్పారని తెలుస్తోంది.
నస్రీన్తో పాటు మరో బాలికను హత్య చేసి షాద్ నగర్లో పడేశామని ఫర్హానా చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే, అబిడ్స్ ప్రాంతంలో గతంలో ఓ డెడ్ బాడీ దొరికింది. దీనికి నయీంకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది.
2012 జూన్ నెలలో వనస్థలిపురంలో ఓ డెడ్ బాడీ దొరికింది. అది ముక్కలు ముక్కలుగా నరికి ఉంది. అతను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడని నాడు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ కేసు తేలలేదు. ఈ హత్యకు నయీంకు సంబంధముందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తాను బెదిరించిన వారి వెన్నులో వణుకు పుట్టించేందుకే నయీం హత్యలు చేసేవాడని భావిస్తున్నారు.
'వైయస్సార్' ఇంట్లోనే ఎక్కువ దందాలు
నయీం తన ఇళ్లకు వైయస్సార్, జగన్, లోకేష్.. ఇలా పలు సినిమా, రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆయా ఇళ్లలో అతను సెటిల్మెంట్లు జరిపేవాడు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో ఉన్న తన ఇంటికి నయీం వైయస్సార్ అని పేరు పెట్టుకున్నాడు.
ఆ ఇంటిలోనే అతను ఎక్కువ దందాలు సాగించినట్లుగా తెలుస్తోంది. పని మనిషి నస్రీన్ను హత్య చేసింది కూడా ఇక్కడేనని తెలుస్తోంది. కాగా, పోలీసులు ఇప్పటి వరకు పదిమందికి పైగా నయీం అనుచరులను అరెస్ట్ చేశారు.