‘ఓటు వేయలేదని కక్ష సాధిస్తున్నారు’: తలసానిపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై మోండా మార్కెట్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. స్థానిక బండిమెట్టుకు చెందిన కొందరు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ డెయిరీ ఫాంలను పోలీసులతో తొలగించి వేస్తున్నారని, ఆవులను అక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తాము ఓటు వేయలేదనే నెపంతో మంత్రి తలసాని తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని అన్నారు.
మంత్రి పదవిలో ఉన్న తలసాని తమ ఉపాధిని దెబ్బతీయడం సరికాదని అన్నారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విరసం నేతల అరెస్ట్
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కేపాల్ వద్ద విరసం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వరంగల్లో ఓ సమావేశానికి బయలుదేరిన విరస నేత వరవరరావు, పౌర హక్కుల నేత హరగోపాల్, ఆయన సతీమణి వనమాలినిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సమావేశానికి అనుమతి ఉన్నా తమను అడ్డుకోవడం అన్యాయమని విరసం నేతలు మండిపడ్డారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.