నారాయణఖేడ్ పోలింగులో అపశ్రుతి: హెడ్కానిస్టేబుల్ మృతి, స్పృహ తప్పిన వీడియో గ్రాఫర్
మెదక్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగులో శనివారంనాడు అపశ్రుతి చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ గ్రామ పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హరిసింగ్ (48) అనే హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు.
హరిసింగ్ పటాన్చెరు పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మరో ఘటనలో నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూ నగర్లో విధుల్లో ఉన్న ఓ వీడియో గ్రాఫర్ స్ప్పహ తప్పి పడిపోయాడు. అతన్ని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
నారాయణఖేడ్లో సార్వత్రిక ఎన్నికల కన్నా ఈ ఉప ఎన్నికలో పోలింగ్ మెరుగైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖేడ్ నియోజకవర్గంలో 77 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకే 73 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి 78 శాతం పోలింగ్ నమోదయింది.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 1,88,839 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పురుషులు 95,772, మహిళలు 93,040 మంది ఓటర్లున్నారు.