జగన్కు తెలంగాణ భారీ షాక్!: టిఆర్ఎస్లోకి అధ్యక్షుడు పొంగులేటి, మరో ఎమ్మెల్యే కూడా
ఖమ్మం: తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. దీంతో జగన్ పార్టీ తెలంగాణలో ఖాళీ అయినట్లేనని తెలుస్తోంది.
కాగా, ఎంపీ శ్రీనివాస్ రెడ్డితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ, 102 మంది ఎంపీటీసీలు, నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, 15 మంది కౌన్సిలర్లు, 8 మంది సొసైటీ చైర్మన్లు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
ఎంపీ పొంగులేటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని సోమవారం ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశాన్ని చర్చించి అక్కడ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్కు రాజీనామాల లేఖలను పంపించనున్నారు.
పార్టీ అభివృద్ధి కోసం ఎంత కృషి చేసినప్పటీకి అధిష్ఠానం నుంచి సహకారం లేకపోవడంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన అనుచరులు కూడా గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ పొంగులేటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, మంగళవారం లేదా బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు అక్కడి అధికార పార్టీ తెలుగుదేశంలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడే టిఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో ఇక తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.
పార్టీ మారుతున్నా: పొంగులేటి
తాను పార్టీ మారుతున్నట్లు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం జగన్ ను కలిసిన శ్రీనివాస్ రెడ్డి.. తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తేల్చి చెప్పారు.