టిడిపి ఎమ్మెల్యే కెసిఆర్ మంత్రివర్గంలోనా?: తలసాని ఇష్యూపై ప్రణబ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మంత్రివర్గంలో ఎలా పనిచేస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎంతమంది పార్టీ ఫిరాయించారు? అధికార టీఆర్ఎస్లో ఎంతమంది చేరారు? అని ఆయన టిడిపి నేతలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించింది. ఆ తర్వాత వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రపతి దాన్ని ఆసాంతం చదివి కొన్ని సందేహాలు వ్యక్తం చేసినట్లు చెప్పారు.
టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రిగా ఎలా పనిచేస్తున్నారని రాష్ట్రపతి అడిగినట్లు టిడిపి నాయకులు చెప్పారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూ రిటర్నింగ్ అధికారి తలసానిని టీడీపీ సభ్యుడిగా అధికారిక జాబితాలో పేర్కొన్నారని తాము రాష్ట్రపతికి తెలిపినట్లు వారు చెప్పారు. టీడీపీ సభ్యుడిగానే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారని కూడా తాము చెప్పినట్లు వారు స్పష్టం చేశారు.
రాష్ట్రపతిని కలిసిన తర్వాత తెలుగుదేశం నాయకులు చెప్పిన వివరాల ప్రకారం - ఏయే పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని రాష్ట్రపతి ప్రశ్నించగా, టీడీపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని టీడీపీ బృందం వివరించింది. తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 63 మాత్రమేఅయినా విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ప్రస్తుతం దాని బలం 83కు పెరిగిందని స్పష్టం చేసింది.
ఫిరాయింపుదారుల వివాదం కోర్టు విచారణలో ఉంది కదా? అని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ విషయమై స్పీకర్కు హైకోర్టు నోటీసులు కూడా జారీచేసిందని, అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చేరడంద్వారా వాటికి సమాధానాలు చెప్పకుండా స్పీకర్ దాటవేస్తున్నారని టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. దాంతో ఫిరాయింపులపై మీ వినతి పత్రాన్ని కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించి తగు చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని టీడీపీ బృందానికి రాష్ట్రపతి హామీ ఇచ్చారు.
టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసానితోపాటు తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్రె డ్డి, మాధవరం కృష్ణారావులను పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ నేతలు వినతిపత్రంలో కోరారు. పార్టీ ఫిరాయించిన తలసాని ఏకంగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు నిరుడు డిసెంబర్ 16న ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించినా, ఆయన రాజీనామాను ఆమోదించారా లేక తిరస్కరించారా? అనే అంశాన్ని శాసనసభ స్పీకర్ ఇప్పటి వరకూ ప్రకటించలేకపోయారని వివరించారు.
ఏడాదిగా ఆయన ప్రజా సమస్యలను విస్మరించి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకే అత్యధిక సమయాన్ని కేటాయించారని రాష్ట్రపతికి టిడిపి నేతలు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతోపాటు పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఈ.పెద్దిరెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, రాజేందర్ రెడ్డి, సాయన్న తదితరులు ఉన్నారు.