ప్రత్యూష-మద్దిలేటి పెళ్లితో బాబు, కెసిఆర్ వియ్యంకులవుతారట: ఎలాగంటే..!
హైదరాబాద్: సవతి తల్లి, తండ్రి చేతిలో చిత్రహింసలకు గురై స్వచ్ఛంద సంస్థల ద్వారా వారి నుంచి విముక్తి పొందిన ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన రెండో కుమార్తెగా చూసుకుంటానని.. ఆమె చదువు, పెళ్లి బాధ్యత తనదేనని చెప్పిన విషయం తెలిసిందే.
కాగా, ప్రస్తుతం ప్రత్యూష్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డి ప్రేమలో ఉంది. అతడ్నే వివాహం చేసుకుంటానని కూడా ఇటీవల ప్రకటించింది. అంతేగాక, పెళ్లి తర్వాత తన చదువును కొనసాగిస్తానని స్పష్టం చేసింది. అయితే, ప్రత్యూషను దత్తత పుత్రికగా స్వీకరించిన సీఎం కెసిఆర్ మాత్రమే ఆమె వివాహం విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా, బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మద్దిలేటి రెడ్డి కలిసిన సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రత్యూషను అక్కున చేర్చుకుని తన రెండో కుమార్తెగా భావిస్తున్న సీఎం కేసీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారని అన్నారు.
కెసిఆర్ సమక్షంలోనే మా పెళ్లి జరగాలి: ప్రత్యూష ప్రియుడు మద్దిలేటి
ప్రత్యూష కోరుకున్న వ్యక్తితో వివాహాన్ని జరిపించి మనవతా దృక్పథాన్ని చాటుకోవాలని అచ్యుతరావు కోరారు. కేసీఆర్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించి మద్దులేటిరెడ్డిని ఏపీ రాష్ట్రం తరపున దత్తత తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు వియ్యంకులవుతారన్నారు.
కాగా, ప్రత్యూష ప్రియుడు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బాల మద్దులేటి రెడ్డి, తులసమ్మల కుమారుడు వెంకట మద్దులేటి రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రత్యూష పేరు మీద ఉన్న ఆస్తి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. తనపై జాలితోనే నాకు ప్రేమ పుట్టింది. ప్రత్యూషకు ఉన్న ఆస్తి రూ.2 కోట్లు అనాథాశ్రమానికి రాసి కట్టుబట్టలతో వచ్చినా ఆమెను బాగా చూసుకుంటాను' అని చెప్పాడు.
బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావును మంగళవారం మద్దులేటి రెడ్డి కలసి ప్రత్యూషతో తన ప్రేమ వ్యవహారాన్ని వివరించారు. నారాయణగూడలోని కుబేరా టవర్స్లో అచ్యుతరావుతో కలసి మద్దులేటి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడాడు.
'ప్రత్యూష చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా స్నేహితుడి బంధువులు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లినప్పుడే నేను ప్రత్యూషను కలిశాను. అలా మా పరిచయం పెరిగింది. నేను రిజిష్టర్ బుక్లో రాసిన వివరాల ఆధారంగా ప్రత్యూష నాకు ఫోన్ చేసింది. 'నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా' అని అడిగింది. నాక్కూడా తనపై ఇష్టం ఉన్నందున వెంటనే ఒప్పుకున్నాను' అని మద్దిలేటి రెడ్డి చెప్పాడు.
ఇప్పటికే తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించానని, ఆమె ప్రేమ విషయాన్ని, మాటలు అన్నీ రికార్డ్ చేశానని, అవన్నీ భద్రంగా ఉంచానని వెంకట మద్దిలేటి రెడ్డి తెలిపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుని ప్రత్యూషతో తన వివాహం జరిపించాలని కోరారు. ఆయన సమక్షంలోనే తమ వివాహం జరగాలని అన్నారు.