చిత్రహింసల కేసు: పోలీసులకు చిక్కిన ప్రత్యూష తండ్రి
హైదరాబాద్: చిత్రహింసలకు గురైన యువతి ప్రత్యూష తండ్రి రమేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. యువతి ప్రత్యూష విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన పరారయ్యాడు. ఆయన రెండో భార్య, ప్రత్యూష సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ అలియాస్ శ్యామలను పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు.
సవతి తల్లి శ్యామల వేధింపుల నుంచి ప్రత్యూష అనే యువతికి బాలల హక్కుల సంఘం విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. ఈ వారం రోజుల క్రితం సవతి తల్లి, తండ్రి చిత్రహింసల నుంచి ప్రత్యూష బయటపడింది. ప్రత్యూష తండ్రి రమేష్ను పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతను టెలికం విభాగంలో ఉద్యోగి.
గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష క్రమంగా కోలుకుంటోంది. ఆమెను ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వత ఎక్కడికి వెళ్లాలనేది ప్రత్యూషకు సమస్యగానే ఉంది. గత చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆమె కాలం గడుపుతోంది.
ఆమె రెండు సార్లు చేసిన ప్రయత్నం కూడా తండ్రి రమేష్, సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల సంకెళ్ల నుంచి స్వేచ్ఛను ప్రసాదించలేకపోయింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వొకేషనల్ మల్టీపర్పస్ వర్కర్స్ కోర్సు చదువుతుండగా ప్రత్యూష తల్లి సరళ 2010లో మరణించింది.
సరళ సోదరుడు ఆమెను తీసుకుని వెళ్లాడు. తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత పద్మారావునగర్కు మారామని, తన మామ ముషీరాబాద్లో ఉండేవాడని, అమ్మమ్మ వారాసిగూడాలో ఉండేదని, తాను మామ వద్ద ఉండడానికి వెళ్లానని, అయితే కొద్ది రోజుల్లోనే తనను అనాథాశ్రమానికి పంపించారని, వారి ఫోన్ నెంబర్ కూడా తనకు ఇవ్వలేదని ప్రత్యూష చెబుతోంది.
తన తండ్రి 2014లో తన వద్దకు వచ్చేవరకు తాను ఎక్కడున్నాననే విషయం బంధువులకు తెలియదని ఆమె చెబుతోంది. తన తండ్రి నాలుగు సార్లు వచ్చి తనతో రమ్మన్నాడని, అయితే తాను వెళ్లడానికి నిరాకరించానని, చివరగా నాలుగో సారి తనను నమ్మించి తీసుకుని వెళ్లాడని ఆమె చెబుతోంది. మొదటి రెండు నెలలు ఏ విధమైన సమస్యలూ ఎదురు కాలేదని చెబుతోంది. ఆ తర్వాత తనకు ఆహారం రెండు సార్లు మాత్రమే పెట్టడం ప్రారంభించారని, కొట్టడం కూడా మొదలు పెట్టారని చెప్పింది.