గిన్నీస్ రికార్డ్: 5కెఎం పరుగెత్తిన నిండు గర్భిణీ
కరీంనగర్: నగరంలోని భగత్నగర్కు చెందిన కామారపు లక్ష్మి(43) అనే తొమ్మిది నెలల నిండు గర్భిణీ 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేగాక, 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది.
ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల 20 సెకన్లలో చేరుకుని రికార్డు నెలకొల్పింది. ప్రత్యక్షంగా తిలకించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆమెకు గుర్తింపు పత్రం అందజేశారు. నిండు గర్భిణీగా ఉండి, 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తటం తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రథమమని తెలిపారు.
గిన్నిస్ బుక్ నిర్వాహకులకు కూడా సిఫారసు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా క్రీడాకారిణి అయిన లక్ష్మి భర్త రవీందర్ కూడా క్రీడాకారుడే. వారికి మూడేళ్ల కూతురు ఉంది. ఈ వారంలోనే ఆమెకు కాన్పు కానుందని సమాచారం.
కాగా, మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు 5కిలో మీటర్లు పరుగు చేయడం వల్లనే సుఖ ప్రసవం జరిగిందని, రెండో కాన్పు కూడా సుఖ ప్రసవం కోసం 5కెఎం పరుగు చేపట్టి గిన్నిస్ బుక్లో పేరు నమోదు కోసం ప్రయత్నించినట్లు లక్ష్మి తెలిపారు.