పూజలు చేస్తే మంత్రి పదవి: ఎమ్మెల్యేకు రూ.57 లక్షల బురిడీ, ఎమ్మెల్యేగా అయ్యేందుకు కూతురు
వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురయింది.తాము పూజలు చేస్తే మీకు మంత్రి పదవి వస్తుందని కోయ దొరలు చెప్పారు. అది నమ్మి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు.
వరంగల్: వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురయింది. తాము పూజలు చేస్తే మీకు మంత్రి పదవి వస్తుందని కోయ దొరలు చెప్పారు. అది నమ్మి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు.
కానీ వారు రూ.57 లక్షల డబ్బు తీసుకొని ఎమ్మెల్యే కుటుంబాన్ని బురిడీ కొట్టించారు. తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి పదవి కోసం పూజలు చేయలేదని, ఆరోగ్యం కోసం చేసినట్లు వారు చెబుతున్నారు.
పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు పెట్టారు. మాయమాటలు చెప్పి డబ్బు వసూలు చేసిన కోయ దొరలు లక్ష్మణ రాజు, వంశీరాజులపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, మంత్రి పదవి కోసం పూజలు చేయించానని చెబితే బావుండదని, కూతురుతో ఆరోగ్యం పేరిట పూజలు చేయించినట్లుగా ఫిర్యాదు చేయించారని తెలుస్తోంది.
అంతేకాదు, తన తండ్రికి మంత్రి పదవి, తనకు ఎమ్మెల్యే పదవి కావాలని ఆ కూతురు పూజలు చేయించినట్లుగా కూడా చెబుతున్నారు.
ఎమ్మెల్యే స్పందన
తాము మంత్రి పదవి కోసం పూజలు చేయించలేదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు. తన ఆరోగ్యం కోసమే తన కూతురు కోయ దొరలతోపూజలు చేయించుకుందని చెప్పారు.
విషయం తెలియగానే తన కూతురుతో పోలీసు కేసు పెట్టించానని చెప్పారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో వారితో పూజలు చేయించారని, ఈ విషయాన్ని వారే పోలీసుల వద్ద చెప్పారని, కోయ దొరల వద్ద విఐపీలతో దిగిన ఫోటోలు ఉన్నాయని చెప్పారు.