చంద్రబాబుకు ఝలక్: ఆర్ కృష్ణయ్యతో పురంధేశ్వరి భేటీ వెనుక 2 కారణాలు!
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆదివారం నాడు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరి భేటీపై చర్చ సాగింది.
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆదివారం నాడు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరి భేటీపై చర్చ సాగింది.
ఆమె భేటీకి ఏపీకి సంబంధించిన అంశం ఒకటి కారణంగా కాగా, రెండోది పార్టీ మార్పు అంశం. ఆమె హైదరాబాద్లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షులు, టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు.
చదవండి: ఎలా చేద్దాం?: చంద్రబాబు 'కాపు రిజర్వేషన్లపై' పురంధేశ్వరి ఆరా
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో వీరి కలయిక చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కలిశారా అని ప్రశ్న పలువురిలో ఉదయించింది.
ఆపరేషన్ ఆకర్ష్ కాదు..
ఆపరేషన్ ఆకర్ష్ అంటే తెలంగాణ నేతలను తెరపైకి తీసుకు వచ్చే వారు. కాబట్టి ఏపీకి సంబంధించిన కాపు రిజర్వేషన్ల అంశం గురించి పురంధేశ్వరి కలిశారని అంటున్నారు.
ఏపీలో చంద్రబాబు ఇచ్చిన హామీపై..
ఏపీలో కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతోంది. కాపులను బీసీల్లో చేర్చుతామని గత ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. ఆ హామీ నెరవేర్చాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం పోరు సాగిస్తున్నారు. ఆయనకు విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి.
గతంలో.. ఇప్పుడు పురంధేశ్వరి భేటీ
మరోవైపు, కాపులను బీసీల్లో చేర్చవద్దని ఆర్ కృష్ణయ్య పోరాడుతున్నారు. ఈ అంశం పైనే పురంధేశ్వరి కలిశారని అంటున్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చితే నష్టం ఏమిటి? కాపులను బీసీల్లో చేర్చుకుంటే ఏమవుతుంది? తదితర అంశాలపై కృష్ణయ్య - పురంధేశ్వరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.
గత నెల కూడా పురంధేశ్వరి గుంటూరులో బీసీ సంఘం అధ్యక్షులు శంకర్ రావును కలిశారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చర్చించారు. ఇప్పుడు కూడా ఆర్ కృష్ణయ్యను అదే విషయమై కలిశారని తెలుస్తోంది.
ఎన్టీఆర్లా మోడీ
భేటీ అనంతరం పురంధేశ్వరి మాట్లాడారు. ప్రధాని మోడీ ఆలోచనలన్నీ అభివృద్ధి వైపే ఉన్నాయన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ పేదల అభివృద్ధి కోసం ఆలోచించినట్లుగానే మోడీ సైతం అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.
జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ తీసుకురావడం, దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించడంతో విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో బీసీలకు న్యాయం జరుగుతోందని, ఇది సాహసోపేతమైన నిర్ణయమన్నారు. మరోవైపు తనను పురందేశ్వరి మర్యాదపూర్వకంగానే కలిశారని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
చంద్రబాబుకు దూరం పాటిస్తున్న కృష్ణయ్యతో భేటీ
టిడిపి నుంచే గెలిచిన ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి దూరం పాటిస్తూ సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.
అంటే ఏపీలో తమ పార్టీయే అధికారంలో ఉన్నా ఆయన బీసీ నేత కాబట్టి తమ బీసీలకు అన్యాయం జరగకూడదని, కాబట్టి కాపులను బీసీల్లో చేర్చవద్దని ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగానే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కలిశారా లేక ఏపీ కాపు రిజర్వేషన్లు, బీసీలకు జరిగే నష్టంపై కలిశారా తెలియాల్సి ఉంది. లేదా రెండు అంశాలపై కలిశారా చూడాలి.